లగ్జరీకి అలవాటు పడ్డారు మరి: బెంజ్ కార్ల రికార్డ్ సేల్స్
ముంబై: విలాసవంతమైన మెర్సిడెజ్ బెంజ్ కార్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలో ఈ సెగ్మెంట్లో మరే కంపెనీ కూడా ఊహించని విధంగా తన యూనిట్లను విక్రయించింది మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ. ఈ సంవత్సరం ప్రారంభంలోనే 26 శాతం పురోభివృద్ధిని రికార్డు చేసినట్లు మెర్సిడెజ్ బెంజ్ యాజమాన్యం తెలిపింది. ఈ ఏడాది పొడవునా ఇదే దూకుడు కొనసాగుతుందని అంచనా వేసింది.
ఈ సంవత్సరం జనవరి-ఫిబ్రవరి-మార్చి మధ్యకాలంలో 4,022 కార్లను విక్రయించిందా కంపెనీ. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో మెర్సిడెజ్ బెంజ్ సేల్స్ జోరందుకున్నాయి. సెమి కండక్టర్లు, చిప్ కొరత వేధించినప్పటికీ తమ ఎస్యూవీలు, సెడాన్లు అంచనాలకు మించిన స్థాయిలో అమ్ముడుపోయినట్లు పేర్కొంది. గత సంవత్సరం ఇదే కాలానికి విక్రయించిన యూనిట్ల సంఖ్య 3,193. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో ఈ సంఖ్య 4,000ను దాటినట్లు స్పష్టం చేసింది.
విక్రయించిన యూనిట్లల్లో ఇ-క్లాస్ లాంగ్ వీల్ బేస్ రకానికి చెందిన సెడాన్ అమ్మకాల సంఖ్య అధికంగా ఉందని, ఎస్యూవీ కేటగిరీలో జీఎల్సీకి భారీగా ఆర్డర్లు అందాయని మెర్సిడెజ్ బెంజ్ వివరించింది. జీఎల్ఏ, జీఎల్ఈ రకానికి చెందిన ఎస్యూవీలు ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. సూపర్ లగ్జరీ కార్ల పోర్ట్ఫోలియో మొదటి క్వార్టర్లోనే 26 శాతం మేర పురోభివృద్ధి కనిపించిందని, రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ ష్వెంక్ చెప్పారు.
సెమి కండక్టర్ల కొరత, గ్లోబల్ సప్లయ్ చెయిన్లో నెలకొన్న ఇబ్బందుల వల్ల కొనుగోలుదారులకు నిర్దేశిత గడువులోగా కార్లను డెలివరీ చేయలేకపోతున్నామని, ఈ గ్యాప్ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. సెమికండక్టర్ల కొరత, ముడి సరుకు, రవాణా వ్యయం పెరిగినప్పటికీ ఎస్యూవీలు, సెడాన్స్కు విపరీత డిమాండ్ ఏర్పడిందని, దీనికి అనుగుణంగా కార్ల తయారీని పెంచేలా ప్రణాళికలను రూపొందించుకున్నట్లు చెప్పారు. అమ్మకాల్లో ఇ-క్లాస్ లాంగ్ వీల్బేస్ సెడాన్, జీఎల్సీ, జీఎల్ఏ, జీఎల్ఈ రకానికి చెందిన ఎస్యూవీలు టాప్లో ఉన్నాయి. ఇక ఏఎంజీ, సూపర్ లగ్జరీ కార్ల కేటగిరీలో 35 శాతం వృద్ధిని చవి చూసింది మెర్సిడెజ్ బెంజ్.