మేహుల్ చోక్సీ బెయిల్పై హైకోర్టు కీలక నిర్ణయం: చైనా ఆసుపత్రిలో ట్రీట్మెంట్
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వేల కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. ఇంకొన్నాళ్లు జైలు జీవితాన్ని గడపక తప్పని పరిస్థితి ఏర్పడింది. అటు భారత్కు, ఇటు ఆంటిగ్వా అండ్ బార్బుడాకు వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటోన్నారు. దీని ప్రభావం.. ఆయన రీప్యాట్రియేషన్ ప్రక్రియపైనా పడే అవకాశాలు లేకపోలేదు. స్వదేశానికి రప్పించడానికి భారత్ చేస్తోన్న ప్రయత్నాలకు బ్రేక్ పడినట్టయింది. మేహుల్ చోక్సీ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ను డొమినికా హైకోర్టు కొట్టి పారేయడమే దీనికి కారణం.
డీజిల్ రేటు కూడా రూ.100 దాటేసింది: రూ.107ను టచ్ చేసిన పెట్రోల్
ఆంటిగ్వా అండ్ బార్బుడాలోని జాలీ హార్బర్ నుంచి కనిపించకుండా పోయిన మేహుల్ చోక్సీ.. డొమినికాలో తేలిన విషయం తెలిసిందే. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించడానే కారణంతో ఆ దేశ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. డొమినికా హైకోర్టు ముందు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు పోలీసు కస్టడీకి అప్పగించింది. జైల్లో ఉండగా అనారోగ్యానికి గురైన చోక్సీని రొస్సోలోని డొమినికా-చైనా ఫ్రెండ్షిప్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. మేహుల్ చోక్సీకి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది, ఆంటిగ్వాకు చెందిన వేన్ మార్ష్ దాఖలు చేసిన పిటీషన్ను తాజాగా హైకోర్టు తిరస్కరించింది.
చోక్సీని క్యారికామ్ (కరేబియన్ కమ్యూనిటీ)కి చెందిన పౌరుడిగా గుర్తించాలని, ఈ కారణంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ వేన్ మార్ష్ ఈ పిటీషన్ దాఖలు చేశారు. క్యారికామ్ పౌరునిగా గుర్తింపు పొందగలిగితే.. కరేబియన్ దీవుల్లో స్వేచ్ఛగా విహరించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అలాగే బెయిల్ దాఖలు చేయడానికి స్థానిక నిబంధనల ప్రకారం.. 5,000 ఈస్టర్న్ కరేబియన్ డాలర్ల జరిమానాను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆయన వాదనలతో డొమినికా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వ్యానెటె ఆడ్రియెన్ రాబర్ట్స్ ఏకీభవించలేదు. బెయిల్ పిటీషన్ను తిరస్కరించారు.