Mehul Choksi case: ఆయనే మాస్టర్మైండ్: డొమినికా హైకోర్టులో సీబీఐ అఫిడవిట్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వేల కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ కేసు వ్యవహారం.. అనూహ్య మలుపు తిరిగింది. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి డొమినికా హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో- భారత అత్యున్నత దర్యాప్తు సంస్థ.. సీబీఐ ఎంటర్ అయింది. ఈ కేసులో ఇంప్లీడ్ కావడానికి అనుమతి ఇవ్వాలంటూ అభ్యర్థించింది. ఈ మేరకు ఓ అఫిడవిట్ను దాఖలు చేసింది. బెయిల్ కోసం మేహుల్ చోక్సీ తరఫు న్యాయవాది వేసిన పిటీషన్ను డొమినికా హైకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల వ్యవధిలోనే చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది.
కనికరించిన నిర్మలమ్మ: బ్లాక్ ఫంగస్ మెడిసిన్పై నో జీఎస్టీ: వాటిపై భారీగా తగ్గింపు
అఫిడవిట్లో కీలక విషయాలు..
సీబీఐ.. తాను దాఖలు చేసిన అఫిడవిట్లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. మేహుల్ చోక్సీ బండారం మొత్తాన్నీ అందులో పొందుపరిచింది. 13,500 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో వెనుక చోక్సీ హస్తం ఉందని స్పష్టం చేసింది. ఆయనే దీనికి మాస్టర్మైండ్ అని కుండబద్దలు కొట్టింది. ఈ కేసులో ఇంప్లీడ్ కావడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టను విజ్ఞప్తి చేసింది. బ్యాంకు అధికారుల నుంచి లెటర్స్ టు అండర్టేకింగ్ (ఎల్ఓయు)లను సాధించడానికి తప్పుడు పత్రాలను సమర్పించారని, బ్యాంక్ అధికారులతో కుట్ర పన్నారని పేర్కొంది. ఆయన కోసం తమతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేసింది.
బ్యాంకు నిబంధనలకు తూట్లు..
డమ్మీ కంపెనీలను సృష్టించడం ద్వారా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎల్ఓయులను చోక్సీ సంపాదించాడని, వాటి ద్వారా బ్యాంకులను మోసం చేశారని తెలిపింది. ఈ విషయంలో బ్యాంకు నిబంధనలకు తూట్లు పొడిచినట్లు ఆరోపించింది. చోక్సీ పరారీలో ఉన్న అంతర్జాతీయ స్థాయి ఆర్ధిక నేరస్తుడని వ్యాఖ్యానించింది. ఆయనను అరెస్ట్ చేయడానికి తాము సుదీర్ఘకాలం నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నామని, ఆచూకీ తెలియరాలేదని స్పష్టం చేసింది. 2018 ఏప్రిల్ 17వ తేదీన భారత న్యాయస్థానం కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసినట్లు తెలిపింది.
చోక్సీ కోసం రెడ్ కార్నర్ నోటీస్
మేహుల్ చోక్సీ కోసం ఇంటర్పోల్ కూడా అన్వేషణ సాగిస్తోందని, ఆయన కోసం ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ను జారీ చేసిందని సీబీఐ డొమినికా హైకోర్టుకు గుర్తు చేసింది. ఈ కేసులో తాము ఇంప్లీడ్ కావడం వల్ల చోక్సీని అరెస్ట్ చేయడానికి చట్టపరమైన అనుమతి దొరుకుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాలన్నింటిలో తాము ఇంప్లీడ్ కావడం వల్ల చోక్సీని అరెస్ట్ చేయడానికి వీలు కలుగుతుందని అభిప్రాయపడింది. అలాగే- చోక్సీని నేరుగా భారత్కు అప్పగించాలంటూ ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి సైతం చేసిన ప్రకటనను సీబీఐ తన అఫిడవిట్లో పొందుపరిచింది.
డొమినికా ఆసుపత్రిలో
మేహుల్ చోక్సీకి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది, ఆంటిగ్వాకు చెందిన వేన్ మార్ష్ దాఖలు చేసిన పిటీషన్ను తాజాగా హైకోర్టు తిరస్కరించింది. జైల్లో ఉండగా అనారోగ్యానికి గురైన చోక్సీని రొస్సోలోని డొమినికా-చైనా ఫ్రెండ్షిప్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు అధికారులు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. ఆంటిగ్వా నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాడనే కారణంతో డొమినికా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. హైకోర్టు ముందు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు పోలీసు కస్టడీకి అప్పగించింది. చోక్సీని క్యారికామ్ (కరేబియన్ కమ్యూనిటీ)కి చెందిన పౌరుడిగా గుర్తించాలని, ఈ కారణంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ వేన్ మార్ష్ ఈ పిటీషన్ దాఖలు చేశారు.