ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ రైతుబిడ్డ.. అగ్రగామి వ్యాపారవేత్తగా.. వేల కోట్ల ఆస్తి..
MEIL: రైతు బిడ్డగా పుట్టి వ్యాపారవేత్తగా ఎదిగే ప్రయాణం చాలా క్లిష్టమైనది. అయితే విజయం సాధించాలే కాంక్ష వారిని జీవితంలో నిరంతరం ముందుకు నడిపిస్తుంటుంది. అలా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రైతు బిడ్డ పీపీ రెడ్డి అంచలంచలుగా ఎదిగారు.
పీపీ రెడ్డి..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది తెలంగాణ కేంద్రంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న మెగా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్(MEIL) కంపెనీ ఛైర్మన్ పీపీ రెడ్డి గురించి. రైతు బిడ్డగా వ్యాపారంలోని ప్రవేశించిన పీపీ రెడ్డి తొలినాళ్లలో ప్రభుత్వానికి చెందిన చిన్నచిన్న కాంట్రాక్ట్ వర్కులను నిర్వహించేవారు.
అదానీ మాదిరిగా..
దేశంలో అగ్ర వ్యాపారవేత్తగా ఉన్న గౌతమ్ అదానీ కుటుంబ ఆస్తుల విలువ 150 బిలియన్ డాలర్లతో కుబేరుల జాబితాలో మెుదటి స్థానంలో నిలిచారు. అయితే పీపీరెడ్డి 4.1 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో 43వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా అనేక కీలక ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టి మంచి గుర్తింపును సంపాదించింది.
వ్యాపార ప్రస్థానం ఇలా..
రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పీపీ రెడ్డి 1989 కాలంలో మెగా ఇంజినీరింగ్ ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించారు. అప్పట్లో చిన్న పట్టణాల్లో పైపుల నిర్మాణాలను కంపెనీ చేపట్టేది. ఆ తరువాతి కాలంలో కంపెనీ రోడ్ల నిర్మాణం, డ్యామ్స్, సహజ వాయువు, విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెగా ఇంజనీరింగ్ వర్క్స్ వంటి అనేక ఇతర రంగాల్లోకి విస్తరించింది. అలా మౌలిక సదుపాయాల నిర్మాణ రంగంలో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా నిర్మించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
కంపెనీ బాధ్యతలు..
2006లో మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ పేరును.. ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్గా మార్చబడింది. అలా పీపీ రెడ్డి నుంచి అల్లుడు పీవీ కృష్ణారెడ్డి 1991లో జతకట్టి కంపెనీని ముందుకు తీసుకెళ్లటంలో కీలకంగా వ్యవహరించారు. దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిన తెలంగాణలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(మిషన్ భగీరథ)ను విజయవంతంగా నిర్మించింది. దీని విలువ దాదాపు 14 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో కరవు దూరం కావటంతో పాటు వ్యవసాయం అభివృద్ధి చెందటానికి తోడ్పడింది.
ఎలక్ట్రిక్ వాహనాలు..
ప్రపంచం క్లీన్ ఎనర్జీ వైపు నడుస్తున్న తరుణంలో మెగా ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్ అయిన Olectra Greentech ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామిగా నిలిచింది. వీటి తయారీలో చైనా BYD నుంచి సాంకేతికతను కొనుగోలు చేసింది.
సబ్సిడరీ కంపెనీలు..
అనేర రంగాల్లోకి విస్తరించిన మెగా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఇతర సబ్సిడరీ కంపెనీలను సైతం కలిగి ఉంది. మెగా ఫైబర్ గ్లాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, MEIL గ్రీన్ పవర్ లిమిటెడ్, వెస్ట్రన్ UP పవర్ ట్రాన్స్మిషన్ కో. లిమిటెడ్, SEPC పవర్ ప్రైవేట్ లిమిటెడ్, JCE ఇంజనీరింగ్ & మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, MEIL హోల్డింగ్స్ లిమిటెడ్, MEIL ఫౌండేషన్ ఉన్నాయి. 36 ఏళ్ల కిందట కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం అత్యుత్తమమైన, ప్రతిష్ఠాత్మకమైన నిర్మాణాలను చేపడుతోంది.