2018 మే 4-2020 అక్టోబర్ 27 మధ్య మారుతి సుజుకి కార్లు కొన్నారా?..టోటల్ రీకాల్
ముంబై: దేశీయ ప్రఖ్యాత వాహనాల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మూడేళ్ల కిందట అమ్ముడు పోయిన కార్లను వెనక్కి పిలిపించనుంది. కొన్ని రకాలకు చెందిన కార్లల్లో డిఫెక్టులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మొత్తంగా 1,81,754 కార్లను రీకాల్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈ ఉదయం ఓ ప్రకటనను జారీ చేసింది మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్.
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో..ఇదివరకే విక్రయమైన వాహనాలు, కార్లను వాటి తయారీ కంపెనీలు వెనక్కి పిలిపించుకోవడం సాధారణ విషయమే. మాన్యుఫ్యాక్చరింగ్ సమయంలో తలెత్తిన లోపాలను గుర్తించడం.. అవి ఏఏ మోడల్కు సంబంధించినవో తెేలిన తరువాత.. వాటిని వెనక్కి పిలిపించుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు తాజాగా మారుతి సుజుకి అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. ఏకంగా 1,81,754 కార్లను రీకాల్ చేయనుంది.
అవన్నీ కూడా పెట్రోల్ వేరియంట్సే కార్లు. 2018 మే 4వ తేదీ నుంచి 2020 అక్టోబర్ 27వ తేదీ మధ్యన దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన అయిదు మోడల్స్కు చెందిన 1,81,754 పెట్రోల్ వేరియంట్స్ కార్లను వెనక్కి పిలిపించే ప్రక్రియను త్వరలోనే చేపడతామని స్పష్టం చేసింది. ఇందులో సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్ 6 మోడల్స్కు సంబంధించిన కార్లు ఉన్నాయి. ఆ మాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్టులను సరి చేయాల్సి ఉందని తెలిపింది.
కారు మోటార్ జనరేటర్ యూనిట్ను రీప్లేస్ చేయడం ద్వారా ఈ లోపాన్ని సరి చేసినట్టవుతుందని పేర్కొంది. ఈ మేరకు ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్లో రెగ్యులేటరీ ఫైల్స్ను అందజేసింది. కాగా- ఈ ప్రక్రియ మొత్తం ఉచితంగా చేస్తామని, ఎవరికీ అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ యాజమాన్యం. ఆధీకృత షో రూమ్ నుంచి కొనుగోలుదారులకు సమాచారం అందిన వెంటనే.. ఈ ప్రక్రియ ఆరంభమౌతుందని చెప్పారు.
మోటార్ జనరేటర్ రీప్లెస్మెంట్.. ఈ ఏడాది నవంబర్ నుంచి చేపట్టనున్నట్లు తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు 2018 మే 4వ తేదీ నుంచి 2020 అక్టోబర్ 27వ తేదీ మధ్యన కొనుగోలు చేసిన అయిదు మోడల్స్కు చెందిన 1,81,754 పెట్రోల్ వేరియంట్స్ సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్ 6 మోడల్స్ కార్లను డ్రైవర్లు నీరు నిండిన ప్రాంతాల్లో నడిపించ వద్దని, ఎలక్ట్రిక్ల/ఎలక్ట్రానిక్ పార్టులపై నేరుగా నీటిని చల్లి, శుభ్రం చేసే ప్రయత్నం చేయొద్దని మారుతి సుజుకి ప్రతినిధులు విజ్ఙప్తి చేశారు.