జనవరి నుంచి పెరుగుతున్న మారుతీ సుజుకీ కార్ల ధరలు, ఎందుకంటే
మారుతీ సుజుకీ వివిధ మోడల్స్ కార్ల ధరలను పెంచనుంది. ఈ మేరకు మంగళవారం మారుతీ సుజుకీ ఇండియా ప్రకటన చేసింది. ఇన్పుట్ ఖర్చులు పెరిగినందువల్ల జనవరి 2020 నుంచి ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఆయా కార్ల ధరలు ఎంత పెరుగుతాయనే అంశాన్ని పేర్కొనలేదు. మారుతీ సుజుకీ ఇండియా తన ఎరీనా, నెక్సా ఛానల్స్ ద్వారా వాహనాలు విక్రయిస్తుంది.
తన ఎరీనా డీలర్షిప్స్ ద్వారా Alto, WagonR, Celerio, S-Presso, Swift, Dzire, Vitara Brezza, Ertiga, Eecoలను విక్రయిస్తుంది. నెక్సా డీలర్షిప్స్ ద్వారా Ignis, Baleno, Ciaz, S-Cross, XL6 కార్లను విక్రయిస్తోంది.
గత సంవత్సర కాలంగా ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల ధరపై ప్రతికూల ప్రభావం పడుతోందని, దీని వల్ల ధరలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా రెగ్యులేటరీ పైలింగ్లో తెలిపింది.

అందుకే జనవరి 2020 నుంచి వివిధ మోడల్స్ ధరలు పెరుగుతున్నాయని, ఖర్చుల పెరుగుదలను కొంత మొత్తం కస్టమర్ల పైన మోపవలసి వస్తుందని పేర్కొంది. ఈ ధరల పెరుగుదల వేర్వేరు మోడల్స్కు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది.
2019లో ఇప్పటి వరకు మారుతీ సుజుకీ ఇండియా సేల్స్ మంత్లీ వైజ్ రెండుసార్లు పెరిగాయి. అక్టోబర్ నెలలో 4.5 శాతం, జనవరిలో 0.2 శాతంగా ఉన్నాయి. మిగతా నెలల్లో సేల్స్ తగ్గాయి. నవంబర్ నెలలో 1.9 శాతం, సెప్టెంబర్లో 24.4 శాతం, ఆగస్ట్లో 32.7 శాతం, జూలైలో 33.5 శాతం, జూన్లో 14 శాతం, మేలో 22 శాతం, ఏప్రిల్లో 17.2 శాతం, మార్చిలో 1.6 శాతం ఫిబ్రవరిలో 0.8 శాతం తగ్గాయి.


Click it and Unblock the Notifications