కరోనా దెబ్బకొట్టింది: 17 ఏళ్లలో మారుతీ సుజుకీకి భారీ నష్టం, పడిపోయిన షేర్లు
దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కరోనా మహమ్మారి కారణంగా 17 ఏళ్లలో తొలిసారి క్వార్టర్ 1లో రూ.268 కోట్ల నష్టాలు నమోదు చేసింది. స్టాక్ మార్కెట్లో 2003లో లిస్ట్ అయిన తర్వాత మొదటిసారి నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ.1,376.80 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో కరోనా ప్రభావం పడిందని, దీంతో నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని మారుతీ సుజుకీ తెలిపింది.
18 ఏళ్లలో భారీ నష్టం, షేర్స్ డౌన్: జపాన్ కంపెనీకి కరోనా దెబ్బ, మిత్సుబిషి 'పేజరో' కనుమరుగు
భారీగా పడిపోయిన సేల్స్
ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో మొత్తం రూ.3,679 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ.18,738.80 కోట్లుగా ఉంది. స్టాండలోన్ ప్రాతిపదికన కంపెనీ విక్రయాలు రూ.3,677.5 కోట్ల విక్రయాలు నమోదు చేయగా, నికర నష్టం రూ.249.4 కోట్లుగా ప్రకటించింది. గత 3నెలల్లో 76,599 వాహనాలు విక్రయించింది.
ఇందులో దేశీయంగా 67,027 విక్రయించింది. 9,572 కార్లని ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే కాలంలో 4,02,594 యూనిట్లు విక్రయించింది. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ క్వార్టర్లో ఉత్పత్తి నిలిచిపోయిందని, విక్రయాలు కూడా జరగలేదని తెలిపింది. సేల్స్ 80 శాతం మేర తగ్గాయి.
ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యం
'కరోనా కారణంగా కంపెనీ చరిత్రలోనే ఇదొక అసాధారణ క్వార్టర్. లాక్ డౌన్ కారణంగా ఎక్కువ ఉత్పత్తి చేయలేని పరిస్థితి. విక్రయాలకు అవకాశం లబించలేదు. ఉద్యోగులు, భాగస్వాములు, కస్టమర్ల ఆరోగ్యం, భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత. ఈ కారణంగా జూన్ క్వార్టర్లో ఉత్పత్తి.. సాధారణ రోజుల్లో చేసిన రెండు వారాల ఉత్పత్తికి సమానం' అని మారుతీ సుజుకీ తన ప్రకటనలో తెలిపింది.
పడిపోయిన షేర్
మే నెలలో కొద్దికొద్దిగా ఉత్పత్తి, అమ్మకాలు తిరిగి ప్రారంభమయ్యాయని మారుతీ సుజుకీ తెలిపింది. మే నెలలో మారుతీ సుజుకీ అమ్మకాలు 86.23 శాతం క్షీణించాయి. జూన్ నెలలో 54 శాతం తగ్గి 57,428 వాహనాలకు పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ నష్టాలను ప్రకటించడంతో బుధవారం షేర్ వ్యాల్యూ 1.62 శాతం నష్టపోయింది. రూ.6,185 వద్ద క్లోజ్ అయింది.