తగ్గని క్రేజ్: 2019లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో తెలుసా?
దేశంలో ఆర్థిక మందగమనం కారణంగా మన ఆటోమొబైల్ రంగం ఈ ఏడాది తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో వాటి తయారీదారులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ కారుకు మాత్రం క్రేజ్ అసలేమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ నెలల మధ్య ఏకంగా 1.2 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. ఆ కారు పేరు 'డిజైర్'.. ఆ కంపెనీ పేరు 'మారుతి సుజుకి'.
అవును ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో ఈ కారు అత్యధిక విక్రయాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం మారుతీ సుజుకీ ప్రకటించింది. ప్రతీయేటా భారీ సంఖ్యలో అమ్ముడుపోతోన్న ఈ మోడల్ ఈ మధ్యనే 20 లక్షల యూనిట్ల మైలురాయిని దాటింది. ఒక్క 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే 2.5 లక్షల డిజైర్ కార్లు అమ్ముడుపోయాయంటే ప్రజల్లో ఈ మోడల్కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
2008లో కంపాక్ట్ సెడాన్ విభాగంలో మారుతి సుజుకి 'స్విఫ్ట్ డిజైర్' తొలితరం మోడల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తరువాత కొన్ని మార్పులతో 2012లో రెండోతరం మోడల్ రోడ్లపైకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న మూడోతరం మోడల్ 2017లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో గత దశాబ్ద కాలంగా ఇది అత్యుత్తమ కారుగా పేరుగాంచింది.
కారు డిజైన్, ఇంటీరియర్ రూపకల్పన, సౌకర్యాలు, భద్రత విషయంలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన మోడల్గా డిజైర్ ప్రసిద్ధి చెందింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్, 4 సిలిండర్లతో కూడిన 82 బీహెచ్పీ శక్తిని ఇచ్చే ఇంజిన్ 114 ఎన్ఎమ్ టార్క్ని విడుదల చేస్తుంది. 1.3 లీటర్ డీజిల్, 74 బీహెచ్పీ శక్తిని కలిగి ఉండే ఇంజిన్ 190 ఎన్ఎమ్ టార్క్ని విడుదల చేస్తుంది.
ఇంకా మారుతి సుజుకి డిజైర్ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్, స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్, యాపిల్ కార్ ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అందుకే ఈ కారుపై జనంలో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారిని ఈ కారు అమితంగా ఆకట్టుకుంటోంది.