ఆటో ఊరట: 9 నెలల తర్వాత మారుతీ సుజుకీ ఉత్పత్తి పెరిగింది, ఎంతంటే?
వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (MSI) 9 నెలల అనంతరం తమ ఉత్పత్తిని పెంచింది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొని, ఆటో సెక్టార్ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా సేల్స్ తగ్గాయి. దీంతో కంపెనీలు తమ ప్లాంట్లను మూసేశాయి. ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో వేలమంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఆటో ఇండస్ట్రీని ఆదుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రకటించింది. ఇప్పుడిప్పుడే ఈ రంగం కాస్త కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
గుడ్న్యూస్: ఆదాయపు పన్ను రేట్లు మరోసారి తగ్గుతాయి! కారణమిదే
తొలిసారి ప్రొడక్షన్ పెంపు
తాజాగా, మారుతీ సుజుకీ ఇండియా వాహనాల ఉత్పత్తిని పెంచింది. నవంబర్ నెలలో 4.33 శాతం మేర అదనంగా వాహనాలను ఉత్పత్తి చేసింది. డిమాండ్ లేని కారణంగా తొమ్మిది నెలలుగా ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చింది. ఇప్పుడు తొలిసారి ప్రొడక్షన్ పెంచడం గమనార్హం.
గత ఏడాది కంటే ఎక్కువ ఉత్పత్తి
నవంబర్ నెలలో మొత్తం 1,41,834 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. గత ఏడాది ఇదే సమయంలో ఆ కంపెనీ 1,35,946 యూనిట్లను ఉత్పత్తి చేసింది.
వాహనాల ఉత్పత్తి పెరుగుదల
ప్రయాణీకుల వాహనాలను నవంబర్ నెలలో 1,39,084 యూనిట్లను ఉత్పత్తి చేయగా, గత ఏడాది నవంబర్ నెలలో ఈ సంఖ్య 1,34,149 యూనిట్లుగా ఉంది. అలాగే యుటిలిటీ వాహనాలు, మిడ్ సైజ్ సెడాన్, లైట్ కమర్షియల్ వాహనాలు ఉత్పత్తిని కూడా పెంచింది. మినీ, కంపాక్ట్ సెగ్మెంట్ కార్ల ఉత్పత్తిని మాత్రం తగ్గించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో వాహన ఉత్పత్తిని 20.7 శాతం తగ్గించి 1,19,337 యూనిట్లను, సెప్టెంబర్ నెలలో 17.48 శాతం తగ్గించి 1,32,199 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. కానీ ఇప్పుడు ఉత్పత్తి పెరిగింది.