Mehul Choksi: ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీపై SEBI చర్యలు.. భారీగా పెనాల్టీ.. 10 ఏళ్లు బ్యాన్
Mehul Choksi: మెహుల్ చోక్సీ అని ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణమే. రుణాల పేరుతో బ్యాంకుకు భారీగా సొమ్ము ఎగ్గొట్టిన ఈ వజ్రాల వ్యాపారిపై మార్కెట్ రెగ్యూలేటరీ సెబీ కూడా చర్యలు చేపట్టింది. దేశం విడిచి పారిపోయిన ఈయనకు భారీ పెనాల్టీ కూడా విధించబడింది.
బ్యాంక్ కు టోకరా..
నీరవ్ మోదీ, అతని బంధువు మెహుల్ చోక్సీ 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి దాదాపు రూ.14,000 కోట్లు లోన్స్ తీసుకుని దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా ద్వీపానికి, నీరవ్ మోదీ లండన్కు పారిపోయారు. అయితే 2019లో నీరవ్ మోదీని అరెస్ట్ చేశారు. గత సంవత్సరం మెహుల్ చోక్సీని కూడా భారత దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.
SEBI చర్యలు..
గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ షేర్లలో మోసానికి పాల్పడిన మెహుల్ చోక్సీపై తాజాగా మార్కెట్ రెగ్యులేటరీ సెబీ చర్యలు తీసుకుంది. 10 ఏళ్ల పాటు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయకుండా నిషేధించింది. దీనికి తోడు అతనికి రూ.5 కోట్లు జరిమానాను విధించింది. ఈ మెుత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశించింది. ఈ చర్యల వల్ల ఆయన మరో 10 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో షేర్ల క్రయవిక్రయాలు, పెట్టుబడులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్వహించటం కుదరదు.
గీతాంజలి జెమ్స్ తో సంబంధం..
నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీ గీతాంజలి జెమ్స్ సంస్థకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అప్పట్లో వారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారు. వాటి రికవరికీ ఆస్తులు కూడా జప్తు చేయబడ్డాయి. గీతాంజలి జెమ్స్ అకౌంట్లలో 2011-2012 మధ్య జరిగిన కార్యకలాపాలపై దర్యాప్తు తర్వాత ప్రస్తుత పరిస్థితులు వచ్చాయి.
ఇన్సైడర్ ట్రేడింగ్..
గీతాంజలి జెమ్స్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ కారణంగా గతంలో సెబీ కంపెనీని ఏడాది పాటు మార్కెట్ల నుంచి నిషేధించింది. రూ.1.50 కోట్ల జరిమానా కూడా విధించింది. కంపెనీ లోన్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కంపెనీ షేర్లు పతనం అయ్యాయి. అందువల్ల కంపెనీ షేర్లను 2019లో ట్రేడింగ్ నుంచి నిలిపివేయటం జరిగింది.