భారీ నష్టం.. అంతలోనే లాభం..: స్టాక్ మార్కెట్ల ఊగిసలాట, ఇన్వెస్టర్లను ఆడుకుంటున్న కరోనా
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం అనూహ్యంగా పుంజుకున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, సౌదీ అరేబియా - రష్యా ధరల యుద్ధం కారణంగా మార్కెట్లు కుప్పకూలాయి. ఈ వారంలో సోమవారం, నిన్న గురువారం భారీగా కుప్పకూలిన మార్కెట్లు శుక్రవారం కూడా పతనంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 3,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 900 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ ట్రేడింగ్ ఏకంగా నిలిచిపోయింది.
కరోనా దెబ్బ: 70 రోజుల్లోనే ముఖేష్ అంబానీ సంపద రూ.1.11 లక్షల కోట్లు ఢమాల్
భారీ నష్టాలు.. లాభాలు.. ఊగిసలాట
భారీ నష్టాలతో ప్రారంభమై, ఏకంగా 45 నిమిషాల పాటు నిఫ్టీ నిలిచిపోయాయి. కానీ ఆ తర్వాత కాసేపటికి మార్కెట్లు లాభాల్లోకి వచ్చేశాయి. ఆ తర్వాత ఏకంగా 250 పాయింట్లు లాభాల్లోకి వచ్చింది. నిఫ్టీ కూడా 60 పాయింట్ల వరకు లాభపడింది. ఈ లాభం కూడా స్వల్ప సమయమే ఉంది. ఆ తర్వాత మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం గం.11 సమయంలో సెన్సెక్స్ 391 పాయింట్ల నష్టంతో 32,387 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 9,438 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత కాసేపటికే సెన్సెక్స్ తిరిగి కాస్త పుంజుకొని 30 పాయింట్ల లాభాల్లోకి, నిఫ్టీ 1 పాయింట్ లాభంలోకి వచ్చింది. మొత్తానికి మార్కెట్లు భారీ ఊగిసలాటలతో ఇన్వెస్టర్లతో ఆడుకుంటున్నాయి.
12 ఏళ్ల తర్వాత నిలిచిపోయిన ట్రేడింగ్
భారత్లో మార్కెట్ ట్రేడింగ్ దాదాపు 12 ఏళ్ల తర్వాత నిలిచిపోయింది. సెబి నిబంధనల ప్రకారం 10 శాతం సర్క్యూట్ బ్రేక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2008లో ఆర్థిక సంక్షోభం సమయంలో ట్రేడింగ్ నిలిచింది. ఇప్పుడు కరోనా దెబ్బకు నిఫ్టీ ట్రేడింగ్ నిలిచిపోయింది.
లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు సంపదను కోల్పోతున్నారు. లక్షల కోట్ల సంపద నిమిషాలు, గంటల్లో ఆవిరవుతోంది. సోమవారం 6 లక్షల కోట్లు, నిన్న 11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద పోయింది. ఈ రోజు కూడా ప్రారంభంలోనే లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. నిఫ్టీ ఓ సమయంలో మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు దాదాపు 7 శాతం నష్టపోయాయి. న్యూజిలాండ్ మార్కెట్లు చరిత్రలోనే అత్యధిక నష్టాలను చవిచూశాయి. జపాన్ నిక్కీ 10 శాతం, సౌత్ కొరియా కొస్టాక్ 8 శాతం పడిపోయాయి. దీంతో ఆ దేశాల్లోను ట్రేడింగ్ నిలిపివేశారు.
ఒక్కరోజు రూ.800 లక్షల కోట్ల సంపద ఆవిరి
1987, బ్లాక్ మండే తర్వాత అమెరికా మార్కెట్లు కూడా భారీ నష్టాలు చవిచూశాయి. ఆసియా మార్కెట్లపై అమెరికా ప్రభావం పడింది. అంతర్జాతీయంగా బుధవారం ఒక్కరోజు రూ.800 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు ఇన్వెస్టర్లు.