టాటా మోటార్స్ స్టీరింగ్.. ఇక మరొకరి చేతుల్లో: కొత్త సారథి ఎవరంటే..?
ముంబై: టాప్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ లిమిటెడ్కు కొత్త సారథి నియమితులయ్యారు. మార్క్ లిస్టోసెల్లా.. ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, మేనేజింగ్ డైరెక్టర్గా స్టీరింగ్ అందుకోనున్నారు. ఈ ఏడాది జులై 1వ తేదీన ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రస్తుతం సీఈఓ అండ్ ఎండీగా కొనసాగుతోన్న గ్యుంటెర్ బస్ట్చెక్ పదవీ కాలం వచ్చే జూన్ 30వ తేదీన ముగుస్తుంది. ఆ మరుసటి రోజే మార్క్ బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ మేరకు టాటా మోటార్స్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
తమ టాటా కుటుంబంలోకి మార్క్ను సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంపై మార్క్కు అద్భుతమైన పట్టు ఉందని, వాణిజ్య వాహనాల తయారీపై ఆయనకు మంచి పట్టు ఉందని అన్నారు. ప్రత్యేకించి- గ్రీన్ ఫీల్డ్ ఆటోమోటివ్ ప్రాజెక్టులపై సమగ్రమైన అవగాహన ఉందని తెలిపారు. ఆయన అనుభవం సంస్థ పురోభివృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు.
ఇదివరకు మార్క్.. ఫుసో ట్రక్ అండ్ బస్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈఓగా పనిచేశారు. డెయిమ్లెర్ ట్రక్స్కు ఆసియా విభాగాధిపతిగా, డెయిమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓగా పనిచేసిన అనుభవం ఉంది. భారత ఆటోమొబైల్ రంగం, ఇక్కడి పరిస్థితులు, డిమాండ్, రోడ్లు.. వాటన్నింటిపైనా మార్క్కు అవగాహన ఉందని టాటా మోటార్స్ పేర్కొంది. విద్యుత్ ఆధారిత వాహనాల తయారీపై టాటా మోటార్స్ ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో అదే రంగంలో అనుభవం ఉన్న మార్క్ను సంస్థ సీఈఓ అండ్ ఎండీగా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
డిజైన్లు, గ్రీన్ ఫీల్డ్ ఆటోమోటివ్ ప్రాజెక్టులపై మార్క్కు మంచి అవగాహన ఉండటం వల్ల భవిష్యత్లో ఎలక్ట్రిక్, రెన్యూవబుల్ ఎనర్జీ వాహనాల తయారీని టాటా మోటార్స్ కంపెనీ మరింత పెద్ద ఎత్తున చేపట్టే అవకాశాలు లేకపోలేదనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మున్ముందు- ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్కు సమానమైన ప్రాధాన్యత టాటా మోటార్స్ ఇవ్వబోతోందనే సందేశాన్ని పంపించినట్టయింది.