3 నెలల కనిష్టానికి మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, ఆర్థిక రికవరీ సరైన మార్గంలో...
నవంబర్ నెలలో భారత మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) 56.3గా నమోదయింది. అక్టోబర్ నెలలో ఇది 58.9గా ఉంది. సెప్టెంబర్లోను మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ 56.8గా నమోదయింది. జనవరి 2012 నుండి ఇది అత్యధికం. ఆ తర్వాత అక్టోబర్లో 58.9గా నమోదయి, దశాబ్ద కాలంలో రికార్డును నమోదు చేసింది. తాజాగా నవంబర్ నెలలో మూడు నెలల కనిష్టానికి చేరింది. గత కొద్దిరోజులుగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గాడిన పడుతోంది.
PF అకౌంట్ నుండి డబ్బులు తీసుకున్నారా? ఐటి రిటర్న్స్లో ఇది తప్పనిసరి!
బలమైన ఆర్థిక కార్యకలాపాలకు సూచి
పీఎంఐ సూచీ 50 పాయింట్లను మించితే ఆ రంగంలో వృద్ధిని సూచిస్తుంది. 50 పాయింట్ల లోపు ఉంటే క్షీణతకు సంకేతం. 2020 ఫిబ్రవరి తర్వాత పీఎంఐ సేవారంగ సూచీ 50 పాయింట్ల ఎగువకు నమోదుకావడం సెప్టెంబర్ నెలలోనే మొదటిసారి. తాజా నవంబర్ నెల పీఎంఐ సూచీ బలమైన ఆర్థిక కార్యకలాపాల వృద్ధిని సూచిస్తోంది. ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఎగుమతులు, కొనుగోలు స్థాయి, ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. కన్స్యూమర్ గూడ్స్ భారీ వృద్ధిని నమోదు చేసింది.
ఆశాజనకమే...
ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. కరోనా కారణంగా అత్యంత ప్రభావితమైన దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు ఏకంగా మైనస్ 23.9 శాతం నమోదు చేయగా, సెప్టెంబర్ క్వార్టర్లో మైనస్ 7.5 శాతంగా నమోదయింది. సూచీలు బలమైన వృద్ధిని సూచిస్తున్నప్పటికీ, వృద్ధి విస్తరణ మూడు నెలల్లో తక్కువగా ఉంది. తాజా సూచీలు సెప్టెంబర్, అక్టోబర్ నెలల కంటే తక్కువగా ఉన్నప్పటికీ అవి దశాబ్ద కాల గరిష్టం కాబట్టి నవంబర్ నెల ఆశాజనకంగానే ఉందని భావించవచ్చు.
ఆర్థిక వ్యవస్థ రికవరీ సరైన మార్గంలో...
భారత ఆర్థిక వ్యవస్థ రికవరీకి సరైన మార్గంలోనే ఉందని కొత్త ఆర్డర్లు, అవుట్పుట్స్ సూచీలను బట్టి నవంబర్ నెలలో వృద్ధి కొనసాగిందని IHS మార్కిట్ పోలియానా డిలామా అన్నారు. ప్రస్తుతం కంపెనీలు సమీప భవిష్యత్తులో నిరంతర డిమాండ్ను అంచనా వేస్తున్నాయని, అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాయన్నారు. కొత్త ఆర్డర్లు గత మూడు నెలల్లో క్రమంగా పెరిగాయని IHS మార్కిట్ సర్వే తెలిపింది.