మందగమనం తప్పదు, ఆర్థికవ్యవస్థకు ఈ మూడు చేయండి: మోడీకి మన్మోహన్ కీలక సూచనలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బీబీసీ ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో భారత ఆర్థిక వ్యవస్థ, పురోగమనం గురించి స్పందించారు. కరోనా నేపథ్యంలో మన దేశంలో తీవ్ర ఆర్థిక మందగమనం తప్పదని హెచ్చరించారు. మూడు చర్యల ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మోడీ ప్రభుత్వానికి సూచనలు చేశారు. దేశంలో ఆర్థిక మందగమనం మానవతా సంక్షోభమని, ప్రభుత్వమిచ్చిన షాక్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అయితే లాక్ డౌన్ అనివార్యమన్నారు.
ఇకనైనా జాగ్రత్తపడతాం! పర్సనల్ ఫైనాన్స్పై భారీ దెబ్బ: సర్వేలో ఏం చెప్పారంటే
మన్మోహన్ మూడు సూచనలు
భారత ఆర్థిక పరిస్థితి కోలుకోవడానికి ఆయన మూడు సూచనలు చేశారు మన్మోహన్ సింగ్. ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజల జీవనోపాధిని కాపాడాలన్నారు. ఇందుకు అవసరమైతే ప్రత్యక్ష నగదు సహాయం చేయాలని, అప్పుడు ప్రజలు ఖర్చు చేసేందుకు మొగ్గు చూపుతారన్నారు. రెండోది ప్రభుత్వం హామీ గల క్రెడిట్ కార్యక్రమాల ద్వారా వ్యాపారాలకు తగిన మూలధనాన్ని అందించాలని సూచించారు. చివరగా సంస్థాగత స్వయం ప్రతిపత్తి, ప్రక్రియ ద్వారా ప్రభుత్వం ఆర్థికరంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకుంది.
రుణాలు తప్పనిసరి.. కానీ
డైరెక్ట్ క్యాష్ ట్రాన్సుఫర్ గురించి మన్మోహన్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అధిక రుణాలు తప్పనిసరి అన్నారు. జీడీపీతో రుణనిష్పత్తిని పెంచుతుందని అంగీకరించారు. అయితే ఈ రుణాలు తీసుకోవడం వల్ల ప్రాణాలను, బోర్డర్స్ను, జీవనోపాధిని పునరుద్ధరించవచ్చునని చెప్పారు. కాబట్టి రుణాలు తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందన్నారు. రుణాలు తీసుకోవడానికి ఆందోళన చెందకూడదని చెప్పారు. కానీ తీసుకున్న రుణాలు ఎలా ఉపయోగిస్తామనేది ముఖ్యమైన అంశమన్నారు. కేంద్రం కూడా ఇప్పటికే రుణాలను తీసుకోవడానికి సిద్ధపడింది.
కరోనాతో పోరాడుతోంది..
గత మూడు దశాబ్దాలుగా భారత వాణిజ్య విధానం ముందుండటమే కాకుండా అన్ని వర్గాలకు అపారమైన ప్రయోజనాలు కలిగించిందని మన్మోహన్ అన్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ లోతైన, దీర్ఘకాలిక మందగమనం అనివార్యంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ధీటుగా ఎదుర్కొని భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించేందుకు పోరాడుతోందన్నారు. కరోనాకు ముందు మందగమనం కారణంగా 2019-20లో జీడీపీ 4.2 శాతంతో దశాబ్ద కాలంలో తొలిసారి నెమ్మదించిందన్నారు. చాలామంది ఆర్థికవేత్తలు భారత ఆర్థిక సంకోచంపై ఏకాభిప్రాయంతో ఉన్నారని, అదే జరిగితే స్వతంత్ర భారతంలో మొదటిసారి అవుతుందన్నారు. అయితే ఈ ఏకాభిప్రాయం తప్పుకావాలని తాను కోరుకుంటున్నానని అభిప్రాయపడ్డారు.