ఆ రోజు దారుణ పరిస్థితి చూశాం: ఆనంద్ మహీంద్రా, భారీగా తగ్గిన M&M లాభం
కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్-జూన్ క్వార్టర్లో మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 94 శాతం తగ్గింది. రూ.54.64 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.894.11 కోట్లుగా ఉంది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.26,041 కోట్ల నుంచి రూ.16,321 కోట్లకు క్షీణించింది. కరోనా, లాక్ డౌన్ ప్రభావంతో సేల్స్, లాభాలు భారీగా పడిపోయాయి.
టిక్టాక్ ఇండియా కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు! ఒకవేళ అది సఫలం కాకపోయినా..
ఏ విభాగంలో ఎంత తగ్గిందంటే.. ఆర్థిక సేవలు జూమ్
ఆటోమోటివ్ విభాగ ఆదాయం రూ.13,587 కోట్ల నుండి రూ.6,508 కోట్లకు పడిపోయింది. వ్యవసాయ పరికరాల విభాగ ఆదాయం రూ.6,078 కోట్ల నుండి రూ.4,906 కోట్లకు తగ్గింది. ఆర్థిక సేవల ఆదాయం మాత్రం రూ.2,822 కోట్ల నుండి రూ.3,031 కోట్లకు పెరిగింది. హాస్పిటాలిటీ రంగంలో ఆదాయం రూ.612 కోట్ల నుండి రూ.294 కోట్లకు తగ్గింది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో కార్యకలాపాలు నిలిచిపోయాయని, దీంతో లాభాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 2020-21లో మూలధన పెట్టుబడులను రూ.12,000 కోట్ల నుంచి రూ.9,000 కోట్లకు తగ్గించినట్లు పేర్కొంది.
2002లో అధ్వాన్న పరిస్థితులు.. పుంజుకున్నాం
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ వృద్ధి సాధిస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. విజయవంతమైన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని మహీంద్రా గ్రూప్ కొనసాగిస్తుందని చెప్పారు. అయితే ప్రణాళికలకు అనుగుణంగా పనితీరును కనబరచని విభాగాలపై తగిన చర్యలు తీసుకుంటామని ఏజీఎంలో తెలిపారు. 2002లో మహీంద్రా షేర్ ధర రూ.56కు చేరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలోనూ అత్యంత అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొన్నామని, ఆ తర్వాత పుంజుకున్నట్లు చెప్పారు.
అందరికీ గడ్డుకాలం
2018లో మంచిపనితీరు కనబరిచిన షేరుగా నిలిచిందని ఆనంద్ మహీంద్రా అన్నారు. క్లిష్ట పరిస్థితులను అవకాశాలుగా మలుచుకునే శక్తి మనకు ఉందని, ఇప్పుడు మందగమనం, కరోనా పరిస్థితులు అత్యంత క్లిష్టమైనవని, ప్రపంచానికే ఇది గడ్డు కాలమని, మనం అతీతులం కాదని, ఈ సంక్షోభం నుండి ఎలా గట్టెక్కేందుకు ఆలోచన చేయాలని, సంక్షోభాల నుండి బయట పడాలని ఆలోచించేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు.