సీఎన్జీపై సర్కార్ సంచలన నిర్ణయం: సగానికి పైగా వ్యాట్ తగ్గింపు
ముంబై: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజలపై మరోసారి ధరల కొరడా ఝుళిపించడం మొదలు పెట్టింది. ఇప్పటికే గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల ధరల మోత మోగించింది. ఒక్కో సిలిండర్ రీఫిల్లింగ్పై 50 రూపాయల అదనపు భారాన్ని మోపింది. పెట్రోల్, డీజిల్ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పేరుతో ఇంధన రేట్లను భారీగా పెంచుకుంటూ పోతోంది.
ఉక్రెయిన్ బిగ్ ప్లాన్: మ్యూజియం ఆఫ్ వార్: విరాళాల సునామీ: ఎన్ఎఫ్టీ, క్రిప్టో రూపంలో
మెడిసిన్స్పైన బాదుడు..
అయిదు రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. ఈ నాలుగు దఫాల్లోనూ కేంద్ర ప్రభుత్వం లీటర్పై 80 పైసల చొప్పున పెంచుకుంటూ పోయింది. మొత్తంగా వాహనదారులు లీటర్పై రూ.3.20 పైసలను అధికంగా చెల్లించాల్సి వస్తోంది. మెడిసిన్స్పైనా ధరల భారాన్ని మోపింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే 800 రకాల మందులపై వడ్డనకు రంగం సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయా రకాల మందులపై 10.7 శాతం వరకు ధరలను పెంచేలా చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెరుగుదల వర్తిస్తుంది.
సీఎన్జీపైనా..
దీని ప్రభావంతో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సైతం తన ధరలను పెంచింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్పై రేట్లను పెంచింది. సీఎన్జీ కేజీ ఒక్కింటికి రూ. 59.01 పైసలు, పీఎన్జీ 36.61 రూపాయలకు చేరింది. స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ మీద ఈ మొత్తాన్ని వసూలు చేస్తామని ప్రకటించింది ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. ధరల పెరుగుదల విపరీతంగా పెరిగిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర
సీఎన్జీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. దీనిపై వసూలు చేస్తోన్న విలువ ఆధిరత పన్ను (వ్యాట్)ను భారీగా తగ్గించనుంది. ప్రస్తుతం సీఎన్జీ మీద మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సర్కార్ 13.5 శాతం మేర వ్యాట్ను వసూలు చేస్తోంది. దీన్ని మూడు శాతానికి తగ్గిస్తామని ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అజిత్ పవార్.. అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. ఈ తగ్గింపు వల్ల ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం 800 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడుతుందని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తగ్గింపు వర్తిస్తుందని వివరించారు.
ప్రత్యామ్నాయానికి ప్రోత్సాహం..
పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అజిత్ పవార్ పేర్కొన్నారు. సీఎన్జీ మీద వ్యాట్ను తగ్గించడం వల్ల పెట్రోల్, డీజిల్ వాహనదారులు సీఎన్జీకి మారుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు, ప్యాసింజర్ వాహనాలకు తమ నిర్ణయం మేలు కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందుకే- వాహనదారులు ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.