ఎన్నారైలకు షాక్: వారు ఇక్కడ ఇళ్లు కొనకుండా బ్యాన్ చేయండి!
నాన్ రేసిండెంట్ ఆఫ్ ఇండియన్స్ (ఎన్నారై) లకు ఇకపై భారత్ లో తిప్పలు తప్పేలా లేవు. మొన్నటి బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎన్నారైలపై పన్ను పోటు పొడవగా ... తాజాగా మద్రాస్ హైకోర్టు మరో సంచనల ప్రతిపాదన చేసింది. ఎన్నారైలు ఇండియాలో ఇండ్లు కొనకుండా నిషేధం విధించాలని ప్రభుత్వానికి సూచించింది. అలాగే స్పెకులేటివ్ ట్రేడింగ్ ను కట్టడి చేయాలని, రెండో ఇంటిని కొనుగోలు చేసే వారి నుంచి 100 % అధిక స్టాంప్ డ్యూటీ వసూలు చేయాలని చెప్పింది. భారత్ లో అందరికీ గృహాలు (హౌజింగ్ ఫర్ ఆల్ ) సాకారం కావాలంటే ఈ చర్యలు తప్పనిసరి అని అభిప్రాయపడింది.
కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్: ఈసారైనా నలుపు తెలుపు అవుతుందా?
కేంద్ర గృహ నిర్మాణ శాఖ తో పాటు ఆర్థిక శాఖ ను కూడా మద్రాస్ హైకోర్టు స్వయంగా ఈ విషయంపై రెస్పాండెంట్ పార్టీలుగా చేర్చింది. ఈ సందర్భంగా రెండు మంత్రిత్వ శాఖలపై ప్రశ్నల వర్షం కురిపించింది. మన దేశంలో ఎన్ని కుటుంబాలకు కనీస వసతులు కలిగిన ఇండ్లు ఉన్నాయి, తమిళ నాడు లో ఎందరికి ఉన్నాయి. జనాభా, గృహాల నిష్పత్తి ఎంత. హోసింగ్ ఫర్ ఆల్ అనేది ఎప్పటి వరకు పూర్తి అవుతుంది వంటి ప్రశ్నలు సంధించింది. ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనం లో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఎందుకు పరిశీలించరు ?
ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వేసిన హైకోర్టు ధర్మాసనం ... పై విధమైన నియంత్రణలు ఎందుకు విధించకూడదు అని నిలదీసింది. తద్వారా గృహాల ధరలు పెరగకుండా నియంత్రించి, దేశంలో అందరికీ గృహాలను సమకూర్చవచ్చుకదా అని చెప్పింది. జస్టిస్ ఎన్ కిరుబకరన్, జుస్టిక్ అబ్దుల్ ఖుద్దోస్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో బలహీన వర్గాలు, సామాన్యులు సహా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తేగల కు గృహాలను అందించే ప్రత్యేకమైన పథకాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయా అని అడిగిన ధర్మాసనం... ఆ వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించింది. అదే సమయంలో ఎంత మందికి ఒకటి కంటే ఎక్కువ గృహాలు ఉన్నాయో కూడా తెలపాలని కోరింది.
లక్షలాది మందికి నిలువ నీడ లేదు..
దేశంలో ఇప్పటికీ లక్షలాది మంది చెట్ల కింద, రోడ్లపైన (ప్లాట్ఫారం), మురికివాడల్లో, కాలువగట్టుల్లో తలదాచుకుంటున్నారని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి సందర్భంలో వారికి కనీస వసతులు గల గృహాలను అందించటం, భద్రత కల్పించటం తక్షణావసరం అని అభిప్రాయపడింది. అలాంటప్పుడు కనీసం హోసింగ్ ఫర్ ఆల్ అనే పథకం పూర్తయ్యేంత వరకు ఎవరైనా సరే రెండో ఇంటిని కొనుగోలు చేయటం నిషేధించ వచ్చు కదా అని ప్రశ్నించింది. ఒకవేళ కొనుగోలు చేసినప్పటికీ నిబంధనలతో కూడిన అనుమతులు మంజూరు చేసి 100% అధిక స్టాంప్ డ్యూటీలు, అధిక నీటి బిల్లు, అధిక కరెంటు బిల్లు వసూలు చేయవచ్చు కదా అని అడిగింది. అదే సమయంలో ఎన్నారైలు ఇక్కడ ఇండ్లు కొనకుండా నిషేధం విధించాలని ప్రతిపాదించింది.
కేసు నేపథ్యం...
తమిళ నాడు లోని కోయింబత్తూర్ సమీపంలో ఒక గృహ నిర్మాణ పథకంలో భాగంగా అక్కడి తమిళ నాడు హౌజింగ్ బోర్డు 369 ఎకరాల స్థలం కొనుగోలు చేస్తోంది. దానిని ఒక ప్రైవేటు పార్టీ నుంచి కొనుగోలు చేస్తుండగా వివాదం నెలకొంది. దానిపై సింగల్ జడ్జి స్థలం కొనుగోలుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. దానిని సవాలు చేస్తూ తమిళ నాడు హౌజింగ్ బోర్డు హైకోర్టు ను ఆశ్రయించింది. కేసు వాదనలు విన్నప్పుడు ధర్మాసనం పై విధంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.