M&M Q4 results: భారీ లాభాల్లో కార్ మేకర్స్: షేర్హోల్డర్లకు గుడ్న్యూస్
ముంబై: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం.. ప్రఖ్యాత వాహన తయారీ కంపెనీ మహీంద్ర అండ్ మహీంద్ర తన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను రెగ్యులేటరీ వద్ద ఫైల్ చేసింది. మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2021-2022లో వందల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందీ కంపెనీ. 17 శాతం మేర పురోభివృద్ధిని రికార్డు చేసింది.
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 1,167 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంది. జనవరి-ఫిబ్రవరి-మార్చి మధ్యకాలంలో 17 శాతం మేర లాభాలను రికార్డు చేసినట్లు తెలిపింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోల్చుకుంటే.. స్టాండ్ అలోన్ ప్రాఫిట్ 427 శాతం పెరిగినట్లు తెలిపింది. అప్పట్లో 245 కోట్ల రూపాయల స్టాండ్ అలోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ను అందుకోగా.. ఇప్పుడది నాలుగింతలు పెరిగింది. 1,292 కోట్ల రూపాయలకు చేరింది.
ఈ నాలుగో త్రైమాసికంలో నమోదైన మొత్తం రెవెన్యూ 17,124 కోట్ల రూపాయలు. ఇందులో 28 శాతం పురోభివృద్ది కనిపించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రికార్డు చేసిన రెవెన్యూ 13,356 కోట్ల రూపాయలే. ఎర్నింగ్ బిఫోర్ ఇంటరెస్ట్, ట్యాక్సెస్, డెప్రిసియేషన్ (ఈబీఐటీడీఏ) మొత్తం 1,946 కోట్ల రూపాయలు. ఇదే ఈబీఐటీడీఏ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి 1,955 కోట్ల రూపాయలు.
కాగా- ఆర్థిక సంవత్సరం మొత్తానికి మహీంద్ర అండ్ మహీంద్ర నమోదు చేసిన నికర లాభాల్లో 401 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. 4,935 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ను అందుకుంది. అంతకుముందు సంవత్సరం ఈ సంఖ్య 984 కోట్ల రూపాయలే. రెవెన్యూలో 29 శాతం పెరుగుదల కనిపించింది. 44,630 కోట్ల రూపాయల నుంచి 57,446 కోట్ల రూపాయలకు పెరిగిందీ మొత్తం. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 1,52,204 వాహనాలను విక్రయించింది. ఇందులో 43 శాతం పురోగమనాన్ని అందుకుంది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మహీంద్ర అండ్ మహీంద్ర యాజమాన్యం.. షేర్ హోల్డర్లకు శుభవార్తను వినిపించింది. వారికి రూ.11.55 పైసల డివిడెండ్ను ప్రకటించింది. ఒక్కో షేర్కు ఈ మొత్తాన్ని అందిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించాల్సి ఉంది. త్వరలోనే నిర్వహించే సమావేశం సందర్భంగా దీన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదిస్తారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.