Loan Moratorium: ఇంకా చేస్తే బ్యాంకులు తట్టుకోలేవ్, బాధ్యత బ్యాంకులదే
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్రం, ఆర్బీఐ లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించింది. మార్చి నుండి ఆగస్ట్ వరకు మారటోరియం కాలానికి సంబంధించి బ్యాంకు రుణగ్రహీతల చక్రవడ్డీని భరించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే మరింత ఉపశమనం కల్పిస్తే బ్యాంకింగ్ రంగం మనలేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇప్పటికే చక్రవడ్డీని తాము భరించామని, ఇంకా ఉపశమనాలు కల్పించలేని పరిస్థితి అని, అలా చేస్తే బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుందని స్పష్టం చేసింది.
మారటోరియం వడ్డీ మాఫీ: వీరికి ఎక్స్గ్రేషియా ఊరటలేదు... కేంద్రం స్పష్టత
ఆర్థిక విధానాలకు సంబంధించినది
మారటోరియం కాలంలో వడ్డీ, చక్రవడ్డీకి సంబంధించి సుప్రీం కోర్టుకు కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇది ఆర్థిక విధానాలకు సంబంధించినదని, ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని తెలిపింది. అదే సమయంలో పవర్ జెన్కోస్, ఇతర పిటిషన్లు తమ సూచనలను ఆర్బీఐకి సమర్పించాలని సుప్రీం కోర్టు సూచించింది. అలాగే, సుప్రీం కోర్టు ముందు ఉంచిన వాటికి సమాధానం ఇవ్వాలని ఆర్బీఐ, కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.
బాధ్యత బ్యాంకులపై ఉంది
చక్రవడ్డీకి సంబంధించి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై మాఫీ చేయాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని కేంద్రం... అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. మారటోరియం కాలంలో ఈఎంఐలు చెల్లించిన వారికి కూడా ప్రయోజనం కల్పిస్తామని తెలిపింది. దీంతో పాటు కరోనా సమయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఉద్దీపన పథకాలను, చితికిపోయిన రంగాలకు ఆత్మనిర్భర్ భారత్ కింద ఇచ్చిన ప్యాకేజీని కేంద్రం వివరించింది. విద్యుత్ పంపిణీ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట కల్పించామని తెలిపారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
సలహాలు, సూచనలు తీసుకోవాలి
గ్యారెంటీలు, ఇతర వాటిపై బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సుప్రీం కోర్టుకు తెలిపాయి. ఆర్బీఐ ఉపశమనంలో లోపాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే వారి సలహాలు, సూచనలను తీసుకోవాలని ఆర్బీఐ, కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. తదుపరి విచారణ లోగా ఆర్బీఐ స్పందించాలని తెలిపింది.