వాటికే తొలి ప్రాధాన్యత: SBI కొత్త చైర్మన్ దినేష్ కుమార్
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కొత్త చైర్మన్గా నిమియమితులైన దినేష్ ఖర బుధవారం(అక్టోబర్ 7) బాధ్యతలు స్వీకరించారు.మూడేళ్ల పాటు SBI చీఫ్గా కొనసాగుతారు. SBI అధిపతిగా దినేష్ను సూచిస్తూ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో చేసిన సిఫార్సుకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రజనీష్ కుమార్ పదవీకాలం మొన్నటితో ముగిసింది. దినేష్ ఎస్బీఐ చైర్మన్గా నియమితులు కావడంతో బ్యాంక్ నలుగురు ఎండీలలో ఒక స్థానం ఖాళీ అయింది. ఈ నెలాఖరులో మరో ఎండీ అరిజిత్ బసు పదవీకాలం కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కొత్త ఎండీలు రావాల్సి ఉంది.
అమెజాన్ ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేయండి ఇలా...: ఫస్ట్ బుకింగ్పై క్యాష్ బ్యాక్
ఎవరీ దినేష్?
SBI ఎండీలుగా పని చేస్తోన్న వారిలో సీనియర్ను చైర్మన్గా నియమించే సంప్రదాయం ఉంది. దినేష్ ఖరా 2016 ఆగస్ట్లో SBI ఎండీగా మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. ఆయన పనితీరు ఆశాజనకంగా ఉండడంతో ఆ తర్వాత రెండేళ్లు పొడిగింపు పొందారు. SBI గ్లోబల్ బ్యాంకింగ్ డివిజన్ హెడ్గా పని చేశారు. ఈయన ఢిల్లీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్వవిద్యార్థి. 1984లో SBIలో ప్రొబేషనరీ అధికారిగా చేరారు. వివిధ పదవులు నిర్వర్తించారు. 2017లో చైర్మన్ పదవికి పోటీపడిన వారిలో ఉన్నారు. 2017లో భారతీయ మహిళా బ్యాంకు, అయిదు అనుబంధ బయాంకులను SBIలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
మరింత మెరుగైన సేవలు..
కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంపై బ్యాంకు దృష్టి పెడుతుందని దినేష్ అన్నారు. కరోనా సంక్షోభం కారణంగా ఏ కార్పోరేట్ సంస్థ అయినా ఒత్తిడి ఎదుర్కొంటే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మద్దతు ఇవ్వడానికి బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పలు ప్రతిపాదనలు అందాయని, అయితే ఇక్కడ రుణ పునర్ వ్యవస్థీకరణ కోరుతున్న కస్టమర్ల సంఖ్యను చూస్తే బ్యాంకు నిర్వహించదగిన స్థాయిలోనే ఈ పరిమాణం ఉందన్నారు. ఆర్థికంగా కుదేలైన వ్యక్తిగత, కార్పొరేట్ రుణగ్రహీతల కోసం ఆగస్ట్లో ఆర్బీఐ ఏకకాల రుణపునర్వ్యవస్థీకరణను ప్రకటించిన విషయం తెలిసిందే.
వాటికే తొలి ప్రాధాన్యత
రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రత, కస్టమర్ల ప్రయోజనాలే బ్యాంకు తొలి ప్రాధాన్యతలు అని కొత్త చైర్మన్ దినేష్ చెప్పారు. మూలధనం విషయంలో బ్యాంకు పరిస్థితి పటిష్టంగా కొనసాగుతోందన్నారు. ఆస్తుల నాణ్యతకే కీలక ప్రాధాన్యమిస్తామన్నారు. బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేస్తామన్నారు. ఎస్బీఐ డిజిటల్ సేవల వేదిక యోనోను పూర్తి అనుబంధ సంస్థగా వేరు చేయాలన్న అంశంపై ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. తగిన సమయంలో ఈ అంశాలను వెల్లడిస్తామన్నారు.