మందగమనం: సాహసోపేత నిర్ణయాలు.. మోడీదే బాధ్యత, ట్యాక్స్ కట్ ఊహాగానాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఆటో, ఎఫ్ఎంసీజీ వంటి వివిధ రంగాలు డిమాండ్ తగ్గి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్రం ఉద్దీపన ప్రకటనల కారణంగా ఇటీవలే కాస్త కోలుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయి. గత క్వార్టర్లో జీడీపీ 5 శాతానికి పడిపోయింది. వచ్చే క్వార్టర్లో అంతకంటే తగ్గుతుందని రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థపై ఓ రకంగా అన్ని నెగిటివ్ వార్తలే వస్తున్నాయి. మరోవైపు మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థకు ఊరట లేనట్లే!
మందగమనానికి ఎన్నో కారణాలు...
గత త్రైమాసికంలో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి పడిపోయింది. వృద్ధి రేటు ఈసారి మరింత తగ్గేలా కనిపిస్తోంది. చాలాకాలంగా కారు లేదా వాహనాల సేల్స్ తగ్గిపోవడం నుంచి మొదలు ఫ్యాక్టరీ ఉత్పత్తి, ఎగుమతులు తగ్గిపోవడం వంటి వివిధ అంశాలు భారత వ్యవస్థను తిరోగమనం వైపు నడిపిస్తున్నాయి.
ఆర్థిక మందగమనం.. రంగంలోకి మోడీ.. బోల్డ్ స్టెప్స్
ఆర్థిక సమతౌల్యత కోసం ఉద్దీపనల అంశాన్ని ఈ ఏడాది ఆరంభంలో ప్రధాని నరేంద్ర మోడీ సెంట్రల్ బ్యాంకుకు వదిలేశారు. ఇప్పుడు మరింతగా క్షీణిస్తుండటంతో మోడీ ప్రభుత్వం సాహసోపేత చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల కార్పోరేట్ పన్ను రేటును తగ్గించింది. ప్రత్యేక రియల్ ఎస్టేట్ ఫండును ఏర్పాటు చేసింది. బ్యాంకులను విలీనం చేసింది. అంతేకాదు, అతిపెద్ద ప్రైవేటీకరణను ప్రకటించింది.
నెమ్మదించిన వృద్ధి
దేశీయ డిమాండ్ దీర్ఘకాలిక బలహీనతను ప్రదర్శిస్తోందని సింగపూర్కు చెందిన డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఎకనమిస్ట్ తైమూర్ అన్నారు. ఉత్పత్తి, సేల్స్ ఒత్తిడిలో ఉన్నాయన్నారు. ట్యాక్స్ కలెక్షన్లు సరిగా లేకుండా పోయాయని, వినిమయం కూడా తగ్గిందని చెప్పారు. బ్లూమ్ బర్గ్ సర్వే చేసిన పాల్గొన్న 41 మంది ఆర్థిక నిపుణుల ప్రకారం జూలై - సెప్టెంబర్ కాలంలో స్థూల జాతీయోత్పత్తి 4.5 శాతం పెరిగిందని చూపిస్తోందని, 2013 తర్వాత ఈ త్రైమాసికంలో కనిష్టం ఇదే. అత్యంత నెమ్మదిగా వృద్ధి సాధించిన ఓ త్రైమాసికం ఇదే.
అత్యంత వేగవంతం నుంచి... కారణాలివే..
గత ఏడాది వరకు ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశాల్లో ముందుంది. 2016లో ఓ క్వార్టర్లో వృద్ధి రేటు 9.4 శాతంగా నమోదు చేసింది. చిన్న వ్యాపారాలకు, కస్టమర్లకు రుణాలు సమకూర్చే కీలక రంగం బ్యాంకులు. ఎన్పీఏల కారణంగా ఇవి బాగా దెబ్బతిన్నాయని, గ్రామీణ వినిమయం తగ్గిందని, దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా మందగమనం ఉందని, ఇవన్నీ కలిసి భారత వృద్ధి రేటుపై ప్రభావం చూపాయని చెబుతున్నారు.
మోడీ ప్రభుత్వానిదే బాధ్యత
వినిమయం, పెట్టుబడుల రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు లిమిటెడ్ చీఫ్ ఎకనమిస్ట్ ఇంద్రాణీపాన్ అన్నారు. బలహీన డొమెస్టిక్ సెంటిమెంటుకు తోడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోయిందని చెబుతున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ ఏడాది రెపో రేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది 2009 కనిష్టానికి చేరుకుంది. మరింత తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల నుంచి తప్పించాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వంపైనే ఉందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ (ఫిచ్ రేటింగ్ లోకల్ యూనిట్) చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర పంత్ అన్నారు. ట్యాక్స్ రెవెన్యూ తగ్గుతూ, బూస్టింగ్ కోసం ఖర్చులు పెరుగుతున్నాయని గుర్తు చేస్తున్నారు.
ట్యాక్స్ కట్ ఊహాగానాలు...
వృద్ధి రేటు, వడ్డీ రేటు కోతలు రూపాయిపై ఆధారపడి ఉంటాయి. ఆసియాలో ఈ క్వార్టర్లో నష్టపోయిన కరెన్సీ రూపాయి. మోడీ ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోవచ్చునని, ఇండివిడ్యువల్స్, ఈక్విటీలపై మరిన్ని ట్యాక్స్ కట్టింగ్స్ ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు రికార్డ్ హైకి చేరుకుంటున్నాయి.