నవంబర్ నెలలో ఐపీవో కోసం ఎల్ఐసీ దరఖాస్తు!
దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(LIC) ఐపీవోకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా చేస్తోంది. వచ్చే నెలలో ఐపీవోకు సంబంధించి ప్రాథమిక పత్రాలను సెబికి సమర్పించేందుకు ముమ్మరం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీని ఐపీవోకు తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సవత్సరంలోనే ఎల్ఐసీని ఐపీవోకు తీసుకు రావాలనే లక్ష్యం తమ ముందుందని అంటున్నారు. ఇందుకు నిర్దిష్టమైన కాలపరిమితిలు కూడా ఉన్నట్లు చెప్పారు. నవంబర్ నెలలోనే సెబీకి ప్రాథమిక పత్రాలను సమర్పించేందుకు సిద్ధమవుతోందట.
ఐపీఓకి వీలుగా ఇప్పటికే నిబంధనలలో మార్పులు చేశారు. ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్కు అనువుగా, లిస్టింగ్ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమిస్తారు. దీంతోపాటు ఎల్ఐసీ ఛైర్మన్ పదవీ విరమణ వయో నిబంధనలను సవరించారు. ప్రస్తుతం 60 ఏళ్లుగా ఉన్న వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచారు. మరోవైపు ఐపీఓ నిర్వహణకు 10 మర్చంట్ బ్యాంకులను కేంద్రం ఇటీవలే ఎంపిక చేసింది. ఇందులో గోల్డ్మన్ శాక్స్, సిటీ గ్రూప్, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ క్యాప్స్ ఉన్నాయి. ఎంపికైన మిగతా బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, నొమురా, బోఫా సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఉన్నాయని తెలుస్తోంది. సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ను న్యాయసలహాదారుగా నియమించారు.
విదేశీ ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనేందుకు అనుమతించే అంశానికి సంబంధించి ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. సెబి నిబంధనల ప్రకారం విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు ఐపీవో ద్వారా షేర్లు కొనేందుకు అర్హులు. కానీ ఎల్ఐసీ చట్టంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి లేదు. ఈ చిక్కును పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.