LIC Q4 Result: నష్టాలబారిన పడ్డ షేర్ హోల్డర్లకు ఓ స్వీట్ న్యూస్: ఫస్ట్టైమ్
ముంబై: కేంద్ర ప్రభుత్వం ఏ ముహూర్తంలో ఎల్ఐసీని ప్రైవేటీకరించాలంటూ నిర్ణయం తీసుకుందో గానీ.. అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయా జీవిత బీమా దిగ్గజ కంపెనీ. ఏది కలిసిరావట్లేదు. నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సంస్థకు మాత్రమే కాకుండా.. ఆ నష్టాల ప్రభావం.. అటు షేర్ హోల్డర్లపైనా పడింది. ఎంతో ఆశపడి కొనుగోలు చేసిన ఎల్ఐసీ షేర్ల ధరలు రోజురోజుకూ దిగజారుతూనే ఉన్నాయి. పాతాళానికి పడిపోతూనే వస్తున్నాయి. లిస్టింగ్ అయినప్పటి నుంచీ ఏ దశలోనూ ఎల్ఐసీ షేర్లు లాభాలబాట పట్టలేదు.
దీనికితోడుగా- ఎల్ఐసీ కూడా నష్టాల్లో నుంచి బయటికి రావట్లేదు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వేల కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూసింది. 17.41 శాతం మేర నికర నష్టాన్ని రికార్డు చేసింది. దీని విలువ రూ.2,371 కోట్ల రూపాయలు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021లో ఇదే చివరి మూడు నెలల కాలంతో పోల్చుకుంటే.. ఈ నష్టం స్వల్పంగా తగ్గింది. అప్పట్లో 2,893 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది.
ఎల్ఐసీ నికర ప్రీమియం మొత్తం భారీగా పెరిగింది. 1.44 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అంతకుముందు ఈ మొత్తం 1.22 లక్షల కోట్ల రూపాయలే. కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ భారీగా తగ్గింది. 2,409 కోట్ల రూపాయలకు పడిపోయింది. గతంలో ఈ మొత్తం 2,917 కోట్ల రూపాయలుగా ఉండేది. మార్చి 31వ తేదీ నాటికి ఎల్ఐసీ సాల్వెన్సీ రేషియో 1.85గా నమోదైంది. కన్సాలిడేటెడ్ నెట్ కమీషన్లో మూడు శాతం పెరుగుదల కనిపించింది. దీని విలువ 7,768 కోట్ల రూపాయలు.
ఇటీవలే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. 902-949 రూపాయల ప్రైస్ బ్యాండ్తో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ జారీ అయింది. మార్కెట్లో నెగెటివ్ ట్రెండ్స్కు అనుగుణంగా బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయింది. లిస్టింగ్ నాడే భారీ నష్టాన్ని పంచింది ఇన్వెస్టర్లకు. అప్పటి నుంచీ కోలుకోలేకపోతోంది. ఒక్కో షేర్ మీద 100 రూపాయల వరకు నష్టాన్ని మిగిల్చింది. ఒక దశలో కనిష్ఠంగా 803 రూపాయల వరకు క్షీణించిందీ ఇన్సూరెన్స్ జెయింట్ షేర్ ప్రైస్. సోమవారం రూ.836.50 పైసల వద్ద ట్రేడ్ అయింది.
ఈ పరిణామాల మధ్య ఎల్ఐసీ ఓ తీపి కబురు వినిపించింది షేర్ హోల్డర్లకు. డివిడెండ్ను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేర్ మీద రూపాయిన్నర డివిడెండ్ను అందించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఎల్ఐసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రెకమెండ్ చేశారు. ఈ డివిడెండ్ను రెండో త్రైమాసికం నుంచి అమలు చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.