పెట్రోల్ సుంకం తగ్గింపు, ఎల్ఐసీ ఐపీవో, చైనీస్ యాప్స్పై నిర్మలమ్మ ఏం చెప్పారంటే?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఎల్ఐసీ ఐపీవో, నిషేధించిన చైనీస్ యాప్స్, ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు తదనుగుణంగా పెరుగుతున్న చమురు ధరల అంశంపై స్పందించారు. పెరుగుతున్న చమురు ధరలు భారత ఆర్థిక స్థిరత్వానికి పెను సవాళ్లు అన్నారు. అలాగే, ఎల్ఐసీ ఐపీవో పట్ల మార్కెట్లో ఆసక్తి నెలకొందని, ఇది వస్తుందన్నారు. 25వ ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (FSDC) సమావేశంలో ఆమె పాల్గొని, ప్రసంగించారు.
ఎల్ఐసీ ఐపీవోపై
ఎల్ఐసీ ఐపీవో పట్ల మార్కెట్లో అమితమైన ఆసక్తి నెలకొందని నిర్మలమ్మ తెలిపారు. ప్రభుత్వం ఈ పబ్లిక్ ఆఫర్ను జారీ చేయాలని చూస్తోందన్నారు. ఇష్యూ జారీకి మార్కెట్ పరిస్థితి అనుకూలంగా ఉంటుందా అనే ఆందోళన కూడా ఉందని, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలను ఉద్దేశించి అన్నారు. భౌగోళిక, రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. అయితే ఎల్ఐసీ ఐపీవో పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగిందన్నారు. అయితే ఈ ఐపీవో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుందన్నారు.
పెట్రో సుంకం తగ్గింపు ఉంటుందా?
రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయని నిర్మలమ్మ గుర్తు చేశారు. క్రూడ్ ధరలు పెరుగుతున్నందున ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ సుంకాలను తగ్గిస్తుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని నిర్మలమ్మ అన్నారు. అదే జరిగితే ఎక్సైజ్ సుంకాల తగ్గింపుపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు మాత్రం భారత ఆర్థిక స్థిరత్వానికి పెను సవాల్ అన్నారు.
చైనా యాప్స్ హానికరం
చైనా యాప్స్ ఏదో విధంగా హానికరమైనవని గుర్తించినందునే వాటిని నిషేధించవలసి వచ్చిందని నిర్మలమ్మ చెప్పారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు (రష్యా-ఉక్రెయిన్ టెన్షన్స్) ఉన్నప్పటికీ భారత విదేశీ వాణిజ్యానికి ఎలాంటి ఆటంకాలు లేవని అభిప్రాయపడ్డారు. ఎగుమతిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.