కోవిడ్-19: ఇండియాలో బీమా రక్షణ ఉన్న వారి సంఖ్య తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
కరోనా వైరస్ ప్రపంచానికి పరిచయమైన సరికొత్త ప్రాణాంతక వైరస్. దీని నుంచి ఎదుర్కొనేందుకు వ్యక్తిగత పరిశుభ్రత, శానిటైజెషన్, మాస్క్ ధరించటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అయితే, ఇది కేవలం మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన మనకు సోకదు అనుకోవటం పొరపాటే. ఇతరుల అజాగ్రత్త వల్ల కూడా మనకు కరోనా సోకే అవకాశం లేకపోలేదు. అందుకే కరోనా మహమ్మారి బారిన పడకుండా కేవలం ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. ఒకవేళ ప్రమాదవశాత్తు అది మనకు సోకితే తగిన చికిత్స పొందేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. కొన్నిసార్లు జరగరానిది జరిగితే మనల్నే నమ్ముకుని బతుకుతున్న కుటుంబ సభ్యుల భవిష్యత్ కోసం తగిన జీవిత బీమా రక్షణ కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇండియా లో ప్రస్తుత పరిస్థితి చూస్తే మనం బీమా విషయంలో ఎంత వెనుకబడి ఉన్నామో తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వ గణాంకాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
కరోనా ఎఫెక్ట్.. ఈ ఏడాది కొత్త పథకాల్లేవ్, ఆ స్కీంలు కూడా ఆపేశాం: నిర్మలా సీతారామన్ ప్రకటన
ఆరోగ్య బీమా ఉన్నది 4% మందికే...
ప్రస్తుతం ఇండియా లో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వార��లో కేవలం 4% మందికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య బీమా) రక్షణ ఉంది. ఈ విషయాన్నీ ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో 2.17 లక్షల మంది కరోనా బారిన పడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో కేవలం 8,500 మందికి మాత్రమే తగిన ఆరోగ్య బీమా పాలసీ లు ఉన్నట్లు తేలింది. వారికి బీమా కంపెనీలు రూ 135 కోట్ల మేరకు చికిత్స కింద క్లెయిమ్స్ చెల్లించాయి. అయితే ఇప్పుడు ఇదే విషయం అటు ప్రభుత్వం లోనూ, ఇటు బీమా కంపెనీల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఇండియా లో ఇప్పటికీ ఇంత తక్కువ ఆరోగ్య బీమా రక్షణ ఉండటం విచారకరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
జీవిత బీమా అయితే 2 శాతమే...
సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీల కన్నా జీవిత బీమా పాలసీ లు అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్య బీమా రక్షణ పాలసీ లు కేవలం పట్టణ, నగర ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తారు. కానీ జీవిత బీమా పాలసీ లు అటు గ్రామీణ ప్రాంత ప్రజలు, ఇటు నగరవాసులు అంత కొనుగోలు చేస్తారు. కానీ, కరోనా వైరస్ తో ఆస్పత్రుల్లో చేరి మృతి చెందిన వారి క్లెయిమ్ ల రేటును బట్టి చూస్తే జీవిత బీమా పాలసీ లు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తేలుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 6,088 మృతి చెందగా... కేవలం 100 మాత్రమే జీవిత బీమా డెత్ క్లెయిమ్ చేసినట్లు తేలింది. ఇది నిజంగా షాకింగ్ లా ఉంది. దీంతో ఈ విషయంపై బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ ... బీమా కంపెనీల మధ్య తీవ్రతరమైన చర్చకు దారితీసింది.
మహారాష్ట్ర లోనే అధికం...
కరోనా వైరస్ విషయంలో చైనాలోని వుహాన్ నగరంలా... ఇండియా లో ముంబై మహా నగరం ప్రభావితం ఐంది. మొత్తం దేశంలోని కేసుల్లో ఈ ఒక్క నగరంలోనే సగానికిపైగా ఉండటం గమనార్హం. అందుకే, మొత్తం బీమా క్లెయిమ్ ల విషయంలోనూ మహారాష్ట్ర ముందువరుసలో ఉంది. మొత్తం క్లెయిమ్స్ లో ఒక్కడే 60% ఉండగా... 15% క్లెయిమ్ ల రేటుతో ఢిల్లీ రెండో స్థానంలో నిలించింది. తమిళనాడు లో 10.4%, పశ్చిమ బెంగాల్ 5.4%, గుజరాత్ 3.4% క్లెయిమ్ రేటుతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక మిగితా అన్ని రాష్ట్రాలు కలిసి 5.8% క్లెయిమ్స్ నమోదు చేశాయి. ఇదిలా ఉండగా, భారత్ లో జీవిత బీమా తీసుకున్న వారి శాతం 2019 లో 4.6% ఉండగా... ఆరోగ్య బీమా శాతం 2.74% మేరకు ఉంది. కానీ కరోనా క్లెయిమ్ ల విషయంలో మాత్రం ఇది తారుమారు అవటం గమనార్హం.