బడ్జెట్లో ప్రత్యేక నిధులు కావాలి: గోయల్కు కేటీఆర్ లేఖ
వచ్చే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రూ.4,070 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. పారిశ్రామిక కారిడార్లు, హైదరాబాద్ ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, నేషనల్ డిజైన్ సెంటర్స్ ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు, హైదరాబాద్ -నాగపూర్, హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్లకు రూ.4,000 కోట్లు ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రికి రాసిన లేఖను బుధవారం కేటీఆర్ విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలకు అండగా నిలవాలని కోరారు.
పెట్టుబడులు వస్తున్నాయి
ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ పరిశ్రమల సమూహమని, రూ.64వేల కోట్ల పెట్టుబడితో 5.6 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో దీనిని చేపట్టామని ఆ లేఖలో పేర్కొన్నారు. భారత్లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కాలుష్యరహితంగా దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఔషధ విశ్వవిద్యాలయం, లాజిస్టిక్ మార్క్, ప్రయోగశాల, స్టార్టప్ హబ్ వంటివి ఫార్మాసిటీ ప్రణాళికలో పొందుపరిచినట్లు తెలిపారు. దీనికి నిమ్జ్ హోదా లభించిందని, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తు చేశారు.
సాయం అవసరం
ప్రాజెక్టు మౌలిక సదుపాయాల కోసం రూ.4,922 కోట్ల నిధులను కేంద్రం నుండి ఆశిస్తున్నట్లు తెలిపారు. కనీసం వచ్చే బడ్జెట్లో రూ.870 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. జహీరాబాద్ నిమ్జ్ 2016లో అనుమతులు పొందింది. రూ.9500 కోట్లతో దీనిని టీఎస్ఐఐసీ ద్వారా రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌలిక వసతుల సదుపాయలను ఇప్పటికే కల్పించినట్లు తెలిపారు. దీనిని మరింత వేగంగా ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రత్యేక నిధులు అవసరమన్నారు. మొదటి దశ కింద రూ.500 కోట్ల సాయం కోరారు.
వీటికి రూ.5వేల కోట్లు
హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్ క్లస్టర్ల పరిధిలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి రూ.5 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ రెండింటినీ వేగవంతంగా చేపట్టడానికి వచ్చే బడ్జెట్లో కనీసం 50 శాతం నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.