ఈ ఏడాది ఆయా సంస్థల్లో వేతనాల పెంపు ఎలా ఉంటుందో తెలుసా..?
అసలే ఆర్థిక మాంద్యంతో భారత్ కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఈ ఏడాది వేతనాల్లో పెంపు ఉంటుందా లేదా అనేదానిపై ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే 2020కి సంబంధించి ఆన్స్ అనే సంస్థ ఉద్యోగస్తుల వేతనాల పెంపుపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఒక్కింత తీపికబురే చెప్పింది సంస్థ. ఈ ఏడాది ఉద్యోగస్తులకు తమ వేతనాల్లో సగటున 9.1శాతం పెంపు ఉంటుందని చెప్పింది. అయితే 2009 నుంచి చూస్తే అత్యల్ప పెంపు ఇదే కావడం విశేషం. 2009లో భారతీయ ఉద్యోగస్తులకు వేతనాల పెంపు సగటున 6.6శాతంగా ఉన్నింది. మొత్తం 20 రంగాలకు చెందిన 1000 సంస్థల్లో సర్వే నిర్వహించింది ఆన్స్ సంస్థ.
సగటున 9శాతం పెంపు
ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ 2020లో ఉద్యోగస్తులకు వేతనాల్లో పెంపు ఉంటుందని వెల్లడించింది. ఏషియా పెసఫిక్ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటే భారతీయ ఉద్యోగస్తుల వేతనాల్లో పెంపు బాగానే ఉందని సర్వే వెల్లడించింది. దాదాపు 30శాతం కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వేతనాల్లో రెండంకెలతో కూడిన పెంపును ఇవ్వాలని భావిస్తున్నట్లు సంస్థలు సర్వేకు వెల్లడించాయి. ఇక వేతనాల్లో అత్యధికంగా ఇచ్చే పెంపు ఈ-కామర్స్ సంస్థలే అని సర్వే తేల్చింది. ఇక ఫార్మా, మెడికల్ డివైస్, ఐటీ, ఎఫ్సీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్ ఇంజినీరింగ్ రంగాల పరిశ్రమలు కూడా తమ ఉద్యోగస్తులకు సగటున 9శాతం కంటే ఎక్కువగానే పెంపు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది.
ఆటోమొబైల్ ఉద్యోగస్తులకు బ్యాడ్ న్యూస్
రవాణా రంగం, లాజిస్టిక్స్ రంగం (7.6శాతం) హాస్పిటాలిటీ, మరియు రెస్టారెంట్లు (8.2శాతం), రియల్ ఎస్టేట్ (8.3శాతం), ఆటోమొబైల్ కంపెనీ(8.3శాతం)లో పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రం వేతనాల్లో పెంపు తక్కువగానే ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఆటోమొబైల్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తుల వేతనాల పెంపు అమాతంగా పడిపోయింది. 2018లో 10శాతంగా ఉన్న పెంపు ప్రస్తుతం 8.5శాతంకు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో ఆటోమొబైల్ పరిశ్రమలు నష్టాల బాట పట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత్లోని చాలావరకు పరిశ్రమలు వేతనాల పెంపులో తమ ఉద్యోగస్తులకు న్యాయం చేస్తున్నాయని ఆన్ అధికారి వెల్లడించారు.
ఆర్థిక వ్యవస్థ క్షీణతతో తగ్గిపోయిన సేవింగ్స్
2011 వరకు భారత్లోని కంపెనీలు తమ ఉద్యోగస్తులకు ఏటా వేతనాల్లో పెంపును కనబర్చేవని ఆ 2011 తర్వాత క్రమంగా వేతనాల పెంపు తగ్గుతూ వచ్చిందని సర్వే అధికారి ఫెర్నాండెజ్ చెప్పారు. ఇదిలా ఉంటే తక్కువ శాతం వేతనాల పెంపు భారత్కు మరో సవాలుగా మారుతుందని ఫెర్నాండెజ్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పతనం కారణంగా ఇప్పటికే సేవింగ్స్లో భారత్ 15ఏళ్ల వెనకబాటుకు పడిపోయిందని ఫెర్నాండెజ్ చెప్పారు. వేతనాల్లో తక్కువ పెంపు ఉండటంతో ఉద్యోగస్తుల సేవింగ్స్ కూడా తగ్గిపోతాయనే ఆందోళన వ్యక్తం చేశారు ఫెర్నాండెజ్. సేవింగ్స్ తగ్గితే అది పెట్టుబడుల పై ప్రభావం చూపుతుందని దీంతో ప్రభుత్వం ఇతర దేశాల నుంచి అధిక రుణాలు పొందేందుకు దారి తీస్తుందని హెచ్చరించారు ఫెర్నాండెజ్.