మరచిపోలేని మరణాలు.. 2022లో దివికేగిన వ్యాపార దిగ్గజాలు.. జున్జున్వాలా నుంచి మిస్త్రీ వరకు..
Year Ender 2022: ఈ ఏడాది భారత వ్యాపార ప్రపంచం చాలా మంది దిగ్గజాలను కోల్పోయింది. ఇందులో బిగ్ బుల్ గా పేరుగాంచిన రాకేష్ జున్జున్వాలా మరణం మార్కెట్లలో పెద్ద అగాథాన్ని నింపింది.
రాకేష్ జున్జున్వాలా..
"బిగ్ బుల్" లేదా ఇండియన్ వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ రంగంలో పరిచయం అక్కర్లేని పేర్లు. ప్రముఖ ఇండియన్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా ఆగస్టు 14న మరణించారు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది యువ ఇన్వెస్టర్లకు మార్గనిర్ధేశకునిగా నిలిచారు. ఆయన మరణాన్ని కొన్నాళ్ల ముందు ఆకాశ పేరుతో విమానయాన కంపెనీని స్థాపించారు.
సైరస్ మిస్త్రీ..
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ గా వ్యవహరించిన సైరస్ మిస్త్రీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్లో సెప్టెంబరు 4న జరిగిన కారు ప్రమాదంలో 54 ఏళ్ల మిస్త్రీ మృతి చెందారు. ఆసమయంలో సైరస్ మిస్త్రీ గుజరాత్లోని ఉద్వాడ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్నారు. మిస్త్రీ మరణంతో టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి ఆయన తొలగింపుపై ఐదేళ్లపాటు సాగిన న్యాయపోరాటం ముగిసింది.
పల్లోంజీ మిస్త్రీ..
సైరస్ మిస్త్రీ మరణానికి కొన్ని నెలల ముందు ఆయన తండ్రి పల్లోంజీ మిస్త్రీ సైతం మరణించారు. అనారోగ్య కారణాలతో పల్లోంజి మిస్త్రీ జూన్ 28న కన్నుమూశారు. నిర్మాణ రంగంలో దిగ్గజ కంపెనీకి పల్లోంజీ మిస్త్రీ అధిపతిగా ఉన్నారు. పల్లోంజీ మిస్త్రీకి చెందిన SP గ్రూప్ 18.37 శాతం వాటాతో టాటా గ్రూప్లో అతిపెద్ద ఇన్వెస్టర్ గా కొనసాగుతోంది.
రాహుల్ బజాజ్..
నాలుగు దశాబ్దాలకు పైగా బజాజ్ గ్రూపునకు నాయకత్వం వహించిన రాహుల్ బజాజ్ ఫిబ్రవరి 12న కన్నుమూశారు. రాహుల్ నేతృత్వంలో కంపెనీ టర్నోవర్ రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోని టాప్ 500 బిలియనీర్లలో ఒకరిగా రాహుల్ బజాజ్ ఉన్నారు. పైగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఛైర్మన్ వంటి అనేక పదవులను నిర్వహించారు.
విక్రమ్ కిర్లోస్కర్..
నవంబర్ 30న టయోటా కిర్లోస్కర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ మరణం.. ఆటోమొబైల్ ప్రపంచాన్ని కుదిపేసింది. విక్రమ్ కిర్లోస్కర్ 1990ల చివర్లో జపాన్ టయోటా మోటార్ కార్ప్ను భారత్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. విక్రమ్ కిర్లోస్కర్ టయోటా గ్రూప్తో కలిసి కర్ణాటకలో ఒక ప్రధాన ఆటోమొబైల్ తయారీ కర్మాగారాన్ని స్థాపించారు.
తులసి తంతి..
విండ్ ఎనర్జీ విప్లవానికి నాంది పలికిన సుస్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసి తంతి అక్టోబర్ 1న మరణించారు. అనేక సార్లు కంపెనీ కష్టకాలంలోకి జారుకున్నా దానిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తొలుత సొంత వ్యాపార అవసరాల కోసం విండ్ మిల్స్ ఏర్పాటు చేసిన తులసి.. దాని భవిష్యత్తును గుర్తించి ఆ రంగంలో అతిపెద్ద వ్యాపారాన్ని స్థాపించారు.
సోశీల్ కుమార్ జైన్..
Panacea Biotec వ్యవస్థాపకుడు సోశీల్ కుమార్ జైన్ 89 ఏళ్ల వయసులో అక్టోబర్ 7న కన్నుమూశారు. ఈ కంపెనీ దేశంలోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీల్లో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది.
ఆరెస్ కంబాట..
రస్నా గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన అరీస్ కంబాటా నవంబర్ 19న 85 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతని నాయకత్వంలో రస్నా కొంతకాలం కోకా-కోలా, పెప్సీ వంటి విదేశీ శీతలపానీయాల కంపెనీలకు గట్టి పోటీని ఇచ్చింది. వేసవి రాగానే పిల్లల నుంచి పెద్దల వరకు రస్నా తాగాలి అనిపించేంతగా దానిని ప్రజలకు చేరువచేశారు.