IT Jobs: ఆందోళనకరంగా టెక్ ఉద్యోగుల తొలగింపులు.. భారత టెక్కీల పరిస్థితి అంతేనా..?
IT Jobs: టెక్ వర్కర్ల గ్లోబల్ లేఆఫ్ ప్రస్తుతం లేబర్ మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఉబర్, ఆపిల్, టెస్లా, మెటా వంటి దిగ్గజాలు ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత ఐటీ ఉద్యోగులు సైతం ఆందోళనలో ఉన్నారు. పైగా కంపెనీ యాజమాన్యాలు మూన్ లైటింగ్ విషయంలో సీరియస్ గా ఉండటం కూడా దీనికి కారణంగా నిలుస్తోంది.
ఏం జరుగుతోంది?
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఉబర్, ఆపిల్, టెస్లా, మెటా వంటి పెద్ద టెక్ కంపెనీలు కూడా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాయి. పెద్ద కంపెనీల నుంచి ఉద్యోగుల కోత అనే మాట అందరినీ షాక్ కి గురిచేస్తోంది. వీటికి తోడు అనేక స్టార్టప్ కంపెనీలు సైతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పుకోక తప్పదు. వాటి పరిస్థితి సైతం దారుణంగానే ఉంది.
కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు..
వచ్చే త్రైమాసిక ఫలితాలు బాగోలేకపోతే, ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని గూగుల్ ఇప్పటికే హెచ్చరించింది. కొత్త ఉద్యోగులను నియమించడానికి బాధ్యత వహించే సుమారు 100 మంది కాంట్రాక్ట్ ఆధారిత రిక్రూటర్లను కూడా Apple తొలగించింది. FY22 రెండవ త్రైమాసికంలో Twitter దాని నియామక ప్రక్రియను గణనీయంగా తగ్గించింది. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలోని 200 మంది ఉద్యోగులను తొలగించింది. టెస్లా సుమారు 200 మంది ఆటోపైలట్ కార్మికులను తొలగిస్తోంది. ఇలా ఎటు చూసినా జాబ్స్ కట్ అనే మాట వినిపిస్తోంది.
మాంద్యం భయాలు..
అన్నింటికీ డబ్బే మూలం అన్న మాటలు నిజం అనిపిస్తున్నాయి. ఎందుకంటే మాంద్యం భయాలు అలుముకున్న తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. Google పేరెంట్ ఆల్ఫాబెట్ లాభం Q2FY22లో 16 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో లాభం 18.5 బిలియన్ డాలర్లుగా ఉంది. Facebook లాభం 36% తగ్గి 6.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మైక్రోసాఫ్ట్ కూడా అంచనాలను మిస్ అయ్యింది. 51.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పోస్ట్ చేసింది. ఇది గడచిన రెండేళ్లలో అతి తక్కువ ఆదాయ వృద్ధి.
ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా..
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు వడ్డీరేట్లను పెంచడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు US ఫెడరల్ బ్యాంక్ పోరాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో అమెరికా మార్కెట్లో ఆర్థిక, వాణిజ్య మందగమనం ఏర్పడింది. ఇది ఇతర ప్రపంచ దేశాలను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
వడ్డీ రేట్ల పెంపుతో వెనకడుగు..
సాధారణంగా అన్ని పెద్ద కంపెనీల చేతిలో వందల కోట్ల నగదు ఉంటుంది. కానీ వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు విస్తరణ ప్రణాళికలు, కంపెనీల టేకోవర్ మొదలైన వాటి కోసం బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంటాయి. అధిక వడ్డీ రేట్లు అంటే రుణాలపై అధిక వడ్డీ చెల్లింపులు. అధిక ద్రవ్యోల్బణం అంటే అన్ని సేవలు, వస్తువులకు అధిక ధరలు. దీంతో ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కంపెనీలు కొత్త ప్రాజెక్టులను ఇలాంటి గడ్డు సమయాల్లో తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేస్తుంటాయి.
ఉద్యోగుల కొరత..
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత 16 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని మ్యాన్పవర్గ్రూప్ అధ్యయనం వెల్లడించింది. భారతీయ ఐటీ, టెక్ సర్వీస్ కంపెనీలకు ఇదో జాక్ పాట్ అంటే అతిశయోక్తి కాదు. కాకపోతే దేశంలో అనుభవజ్ఞులైన టెక్కీల కొరత కంపెనీలను వెంటాడుతోంది.
భారత ఐటీ ఉద్యోగులు పరిస్థితి..
ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ఈ విపత్కర పరిస్థితి భారత IT కంపెనీలకు ఒక వరంగా ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. భారతీయ IT సేవల కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్న విదేశీ కంపెనీలకు, తక్కువ జీతాలతో తగినంత మంది సిబ్బందిని అందించగలవు. దీని కారణంగా దేశంలో కొత్తగా విద్యను పూర్తి చేసుకున్న, ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న యువతకు మంచి అవకాశాలు లభించనున్నాయి.