Inflation Effects: ద్రవ్యోల్బణం ఎలా పీల్చి పిప్పి చేస్తుందో తెలుసా..? మనకు కలిగే నష్టాలు ఇవే..
Inflation Effects: గత కొన్ని నెలలుగా దేశంలోని ప్రజలు మాత్రమే కాక, ప్రపంచ వ్యాప్తంగా అందరూ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది మనపై ఎలా ఉంటుంది..? ఎంత కాలం ఉంటుంది..? ఆర్థికంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది..? వంటి విషయాలను మనందరం తెలుసుకోవటం చాలా ముఖ్యం. ద్రవ్యోల్బణాన్ని అర్థం చేసుకుని ఎలా జాగ్రత్తపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రవ్యోల్బణం అంటే ఏమిటి..?
వస్తువులు, సేవల ధరలు ఉండాల్సిన పరిమితి స్థాయిల కంటే ఎక్కువ ఉంటేనే చేటుచేస్తుంది. అలా అని ధరలు పెరగుదల, ద్రవ్యోల్బణం అనేవి చెడ్డవి కాదు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా వస్తువులు, సేవల ధరలు పెరుగుతూనే ఉంటాయి. ధరలు పెరిగినప్పుడు.. ప్రజలు కొనుగోలు చేయడం మానేస్తారు. దీంతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. దీని కారణంగా దేశంలో మాంద్యం ముప్పు పెరుగుతుంది. కాబట్టి, ద్రవ్యోల్బణం అనేది వాస్తవానికి మనం కొనుగోలు చేసే వస్తువులు, సేవల ధరల పెరుగుదల రేటు. మనమందరం ద్రవ్యోల్బణానికి కట్టుబడి ఉన్నాము. అది ఒక పరిమితిలో ఉండాలి.
విషమించిన పరిస్థితి..
ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని ఆదేశించింది. గత 9 నెలలుగా ద్రవ్యోల్బణం పరిమితులకు మించి పెరగటం పరిస్థితులను విషమించటానికి కారణంగా మారుతోంది. సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5 నెలల గరిష్ఠ స్థాయి 7.41 శాతానికి పెరిగటం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ద్రవ్యోల్బణం ఆర్బిఐ టాలరెన్స్ బ్యాండ్ 2-6 శాతం కంటే ఎక్కువగా ఉండడం ఇది వరుసగా తొమ్మిదో నెల.
స్ట్యాండర్డ్ ఆఫ్ లివింగ్..
ద్రవ్యోల్బణం పరిమితులకు మించి పెరగటం వల్ల మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ధరలు పెరగటం అంటే.. కిరాణా సామాగ్రి నుంచి పెట్రోల్, డీజిల్ వరకు అన్ని రేట్లు పెరిగి ఖరీదైనవిగా మారతాయి. ఈ సమయంలో చాలా మంది వైద్యం వంటి ముఖ్యమైన ఖర్చులను సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇన్వెస్ట్ మెంట్స్ సైతం నెగటివ్ రాబడిని అందిస్తున్నాయి. చాలా మంది డబ్బు ఖర్చు చేయటానికి వెనుకాడుతున్నందున వస్తుసేవలకు డిమాండ్ తగ్గుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తమ జీవనశైలిని కూడా మార్చుకుంటున్నారు.
ఆర్థిక జాగ్రత్తలు..
అధిక ద్రవ్యోల్బణం వల్ల బ్యాంకులు లోన్స్ ఇవ్వటం తగ్గిస్తాయి. ఎందుకంటే రేట్లు అధికంగా ఉండటం వల్ల తప్పనిసరి అయిన కొందరు మాత్రమే రుణాలు తీసుకుంటారు. కాబట్టి డీఫాల్ట్ అయ్యే రిస్క్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఉన్న డబ్బును సేఫ్ పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయటం ఉత్తమమని, వడ్డీ ఆదాయం ఆశతో ఇతరులకు అప్పుగా ఇవ్వటం అంత సురక్షితం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీని దుష్ప్రభావాల కారణంగా ఉద్యోగులు కోల్పోవటం, ఆర్థిక మందగమనం పెరుగుతుంది.