రియాల్టీలో హైదరాబాద్ అదుర్స్, ధర పెరుగుదల మాత్రం 1 శాతం
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కొత్త ఇళ్ల నిర్మాణం,సేల్స్ గణనీయంగా పెరిగినట్లు రియాల్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది జనవరి-జూన్ నెలల్లో 16,712 కొత్త ఇళ్లు/ప్లాట్ల నిర్మాణం కాగా, 11,974 ఇళ్లు/ప్లాట్ల అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.4,422 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఈసారి 278 శాతం పెరిగింది. క్రితంసారి 4,782 ఇళ్లు అమ్ముడుపోగా, ఈసారి 150 శాతం వృద్ధి నమోదు అయింది.
8 ప్రధాన నగరాల్లో ఈ వృద్ధి 67 శాతం మాత్రమే. ఇదే విధంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు/ప్లాట్స్ సంఖ్య కూడా ఏడాది వ్యవధిలో 40,037 నుండి 11,918కి పెరిగింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో హౌసింగ్ నిర్మాణం, సేల్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపింది. అంటే కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో నిర్మాణాలు, సేల్స్ ఎక్కువగా ఉన్నాయి.
వివిధ నగరాల్లో అమ్మకాలు
దేశంలోని 8 పెద్ద నగరాలను చూస్తే ముంబైలో 53 శాతం వృద్ధి నమోదయి 28,607 ఇళ్లు/ప్లాట్ల అమ్మకాలు, పుణేలో 74 శాతం వృద్ధి నమోదయి 17,474 ఇళ్లు/ప్లాట్ల అమ్మకాలు, బెంగళూరులో 22 శాతం వృద్ధి నమోదయి 14,812 ఇళ్లు/ప్లాట్ల అమ్మకాలు, హైదరాబాద్లో 150 శాతం వృద్ధి నమోదయి 11,974 ఇళ్లు/ప్లాట్ల అమ్మకాలు, ఢిల్లీ-NCRలో 111 శాతం వృద్ధి నమోదయి 11,474 ఇళ్లు/ప్లాట్ల అమ్మకాలు, చెన్నైలో 93 శాతం వృద్ధి నమోదయి 5,751 ఇళ్లు/ప్లాట్ల అమ్మకాలు, కోల్కతాలో 74 శాతం వృద్ధి నమోదయి 5,115 ఇళ్లు/ప్లాట్ల అమ్మకాలు, అహ్మదాబాద్లో 67 శాతం వృద్ధి నమోదయి 4,208 ఇళ్లు/ప్లాట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
పెరుగుదల 1 శాతమే
కరోనా సెకండ్ వేవ్ కారణంగా రియాల్టీ పరిశ్రమ మందగమనంతో ఉండగా, హైదరాబాద్ రియాల్టీ అత్యంత స్థిరమైన మార్కెట్గా నిలిచింది. జూన్ నెలతో ముగిసిన ఆరు నెలల కాలానికి హైదరాబాద్లో నివాస గృహాల విక్రయాలు 150 శాతం పెరగడం గమనార్హం. ఈ ఏడాది ప్రథమార్థంలో హైదరాబాద్లో నివాస గృహాల విక్రయ ధరల్లో వృద్ధి మాత్రం కేవలం 1 శాతంగా మాత్రమే ఉంది.
స్థిరమైన మార్కెట్
ఇదిలా ఉండగా, కరోనా సమయంలో స్థిరమైన మార్కెట్లలో హైదరాబాద్ నిర్మాణ రంగం ఒకటిగా నిలిచినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) తెలిపింది. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉందని క్రెడియ్ హైదరాబాద్ అధ్యక్షులు తెలిపారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఏవియేషన్ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, వాటితో ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తున్నాయని గుర్తు చేశారు. టెక్, ఐటీ సంస్థలు 30 లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు.