అమ్మకాల్లో ‘కియా’ భేష్.. మరి ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్ల ఉత్పత్తి ఎప్పుడో?
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్.. భారత్లో కార్ల తయారీలోనే కాదు, అమ్మకాలలోనూ దూసుకుపోతోంది. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో తన కార్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం గంటకు 450 కార్లను తయారు చేస్తోన్న కియా మోటార్స్.. కేవలం ఐదు నెలల్లోనే యాభై వేల 'సెల్టోస్' కార్లను విక్రయించింది. అయితే పెనుకొండ యూనిట్లో ఈ కంపెనీ విస్తరణ, ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్ల తయారీపై తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం నుంచి తగినంత సహకారం కొరవడడమే అని తెలుస్తోంది.
భారత్లో ‘సెల్టోస్' రికార్డు అమ్మకాలు...
అమ్మకాలలో కియా మోటార్స్ భారత్లో మరో మైలురాయిని అధిగమించింది. గత ఏడాది ఆగస్టులో తన వాహన శ్రేణిలోని మిడ్ సైజ్ ఎస్యూవీ ‘సెల్టోస్' కారును ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ కంపెనీ కేవలం 5 నెలల్లో 50 వేల కార్లను విక్రయించింది. ఈ కారు అమ్మకాల వేగాన్ని చూసి భారత మార్కెట్లో మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టాలని కూడా కంపెనీ వర్గాలు యోచిస్తున్నాయి. అంతేకాదు, 2025 నాటికి తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో 11 కొత్త మోడళ్లు ప్రవేశపెట్టాలని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా (చైనాలో తప్ప) ఏడాదికి 6 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని ప్రణాళికలు రచిస్తోంది.
అనంతపురంలో ఏడాదికి 3 లక్షల కార్ల తయారీ...
ప్రస్తుతం కియా మోటార్స్ పెనుకొండ యూనిట్లో 8 గంటలు చొప్పున రెండు షిప్టులు నడుస్తున్నాయి. ఈ రెండు షిఫ్టుల్లోనూ గంటకు 450 కార్ల ఉత్పత్తి జరుగుతోంది. త్వరలో మరో షిప్టును కూడా ప్రారంభించాలని, ఏడాదికి 3 లక్షల కార్లను ఇక్కడ తయారు చేయాలని, ఇక్కడ్నించి విదేశాలకూ ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది. అయితే కార్ల ఉత్పత్తి చేపట్టి ఏడాది గడిచినా ఎగుమతికి సంబంధించిన ప్రాథమిక పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆటో ఎక్స్పో 2020లో ‘కార్నివాల్'...
ఇక ఫిబ్రవరి 5 నుంచి 12 వరకు జరిగే ‘ఆటో ఎక్స్పో 2020'లో తన సత్తా చాటాలని కూడా ‘కియా మోటార్స్' నిర్ణయించుకుంది. ఈ ప్రదర్శనలో తన కంపాక్ట్ ఎస్యూవీతోపాటు కార్నివాల్ ఎంపీవీ(మల్టీ పర్పస్ వెహికల్) కార్లను కూడా ప్రదర్శనకు ఉంచాలని భావిస్తోంది. ప్రస్తుతం కియా సెల్టోస్ కారును భారత మార్కెట్లో విక్రయిస్తుండగా.. మరో కొత్త మోడల్ ‘కార్నివాల్'ను విడుదల చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఈ కారుకు సంబంధించి బుకింగ్స్ జనవరి 21న ప్రారంభంకాగా.. తొలిరోజునే 1,410 కార్లు బుక్ అవడం విశేషం.
ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్ల ఉత్పత్తి కోసం...
భారత్లో కూడా ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్లను ఉత్పత్తి చేయాలని కియా మోటార్స్ భావిస్తోంది. దీనికి అనువుగా గత ఏడాదే పెనుకొండ ప్లాంటులో కెఎంఐ కేంద్రంలో ప్రొడక్షన్ లైన్లన్లు డిజైన్ కూడా చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పెనుకొండ యూనిట్ను మరింత విస్తరించాలని కంపెనీ భావించింది. దీనికోసం 650 ఎకరాలకుపైగా భూమి అవసరమని కియా.. ఏపీఐఐసీని కోరింది. ఇందుకు అంగీకరించిన చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో కియా మోటార్స్కు అవసరమైన భూమిని ఇచ్చేందుకు ఎర్రమంచి, అమ్మవారుపల్లి, చిన్నపరెడ్డిపల్లి, మునిమడుగు గ్రామాల పరిధిలో వేయి ఎకరాల వరకు భూములను కూడా గుర్తించింది. ప్రస్తుతమున్న కియా ప్రధాన ప్లాంటు వెనకే ఎలక్ర్టికల్ కార్ల యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీ ఈ భూమిని సిద్ధంగా ఉంచింది.
యూనిట్ విస్తరణపై సందేహాలు!
అయితే ప్రస్తుతం పెనుకొండలోని కియా కార్ల తయారీ ప్లాంటు విస్తరణపై సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి తగినంత సహకారం కియా మోటార్స్కు లభించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. పెనుకొండ యూనిట్లో కార్ల తయారీ అంచనా మేరకు సాగుతున్నా ప్రస్తుతం ఎలక్ర్టిక్ కార్ల యూనిట్ ఊసే లేకపోవడంతో పరిశ్రమ విస్తరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఔరంగాబాద్ ఇండస్ర్టియల్ సిటీ(ఏయూఆర్ఐసీ), ఢిల్లీ-ముంబై ఇండస్ర్టియల్ కారిడార్ ప్రాంతంలో కియా తన ప్లాంటు ఏర్పాటు చేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పట్లోనే జారిపోయేది...
నిజానికి కియా మోటార్స్ భారత్కు వస్తున్న తరుణంలోనే ఔరంగాబాద్ ఇండస్ర్టియల్ సిటీ పోటీ పడింది. కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కృషి కారణంగా కియా మోటార్స్ ఔరంగాబాద్ను కాకుండా ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది. ఇప్పుడు ఎలక్ర్టిక్ హైబ్రిడ్ కార్ల ఉత్పత్తికి అవసరమైన భూముల సేకరణ పూర్తయినా.. ఆ దిశగా ఎలాంటి పనులు ప్రారంభం కాకపోవడంతో.. ఇంతకీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంటు పెనుకొండ యూనిట్లో ఏర్పాటవుతుందా? లేక మరోచోటికి తరలిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.