తిరువనంతపురం: ఇంధన-సమర్థవంతమైన డ్రైవర్లను గుర్తించడంలో, ఆచరణీయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడుతున్న కేరళకు చెందిన మహిళా స్టార్టప్.. ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాలతో మొదటిసారిగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై తిరువనంతపురానికి చెందిన వైద్యుతి ఎనర్జీ సర్వీసెస్ (వీఈఎస్) సంతకం చేసింది.
ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాల కోసం సంతకం చేసిన భారతదేశానికి చెందిన 170 కంపెనీలలో 64 కంపెనీలు ప్రైవేటు రంగానికి చెందినవని కంపెనీ ప్రకటన ఈ సందర్బంగా తెలిపింది. వీఈఎస్.. భారతదేశం నుంచి 65వ సంస్థ, కేరళ నుంచి యూఎన్తో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్న మొదటి సంస్థ.
కాగా, ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాలను అమలు చేయడానికి కేరళ ఇప్పటికే నీతి ఆయోగ్ జాబితాలో ఉంది.
మహిళా సాధికారత సూత్రాలు మార్కెట్లో, సమాజంలో మహిళలను ఎలా శక్తివంతం చేయాలనే దానిపై పనిచేసే ప్రదేశం, ప్రైవేట్ రంగానికి ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి.
ఒప్పందంపై సంతకం చేయడంతో, వీఈఎస్ లింగ సమానత్వం కోసం ఉన్నత స్థాయి కార్పొరేట్ నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, అంతేగాక, అందరూ మహిళలు, పురుషులను పనిలో సమానంగా చూస్తుంది. మానవ హక్కులు, వివక్షత లేకుండా వారిని గౌరవిస్తుంది, మద్దతు ఇస్తుంది. మహిళలు, పురష కార్మికుల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తుంది. అనేక ఇతర విషయాలతోపాటు విద్యను ప్రోత్సహిస్తుంది.
పునరుత్పాదక ఇంధన రంగంలో అపార అనుభవం ఉన్న, గల్ఫ్ సహా వివిధ దేశాలలో బహుళజాతి ప్రాజెక్టులలో పాలుపంచుకున్న అనూప్ బాబు అనే ఎన్ఆర్ఐ వీఈఎస్ను స్థాపించారు.
వివిధ సంవత్సరాల పరిశోధనల తరువాత.. అనూప్ బాబు తన కలల ప్రాజెక్టును ప్రారంభించారు. సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న అతని తల్లి ఇందిరా బాబును మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు.
కన్సల్టెన్సీ-కమ్-ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సంస్థ, వీఈఎస్ మహిళల సాధికారతను లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాక, దీనిలో అన్ని కీలక పదవులు మహిళలచే నిర్వహించబడుతుండటం విశేషం.
కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఇంధన సామర్థ్య విభాగంలో రిటైర్డ్ ఇంజనీర్ సుధా కుమారి వీఈఎస్ వ్యాపార అధిపతిగా ఉన్నారు. ఆపరేషన్స్ హెడ్ కోకిలా విజయకుమార్, ఇంధన రంగంలో అపారమైన పరిజ్ఞానం ఉన్న వాణీ విజయ్ కూడా కీలక పదవులను నిర్వహిస్తున్నారని ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది.

ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక శక్తి, శక్తి నాణ్యత అంచనా, ఇ-మొబిలిటీ, వాతావరణ మార్పు, శక్తి ఆడిట్, ప్రాజెక్ట్ నిర్వహణ, కార్బన్ అకౌంటింగ్ రంగాలలో కన్సల్టింగ్, శిక్షణ, ఆర్ అండ్ డీలను వీఈఎస్ అందిస్తోంది.
ఢిల్లీకి చెందిన సిఐఐ-ఐటిసి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సహకారంతో కేరళలో గ్రీన్ ఎనర్జీలో సర్టిఫైడ్ సాంకేతిక శిక్షణను అందించే మొట్టమొదటి గుర్తింపు పొందిన సంస్థ వీఈఎస్ కావడం గమనార్హం.
వివిధ పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలకు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో వీఈఎస్ సాంకేతిక సహకారం అందించింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో 'కేరళ మోడల్' ను స్థాపించడమే తమ లక్ష్యమని వీఈఎస్ పేర్కొంది.


Click it and Unblock the Notifications