IT News: ఇండియన్ సిలిక్ వ్యాలీ సీరియస్ వార్నింగ్.. ఆ టెక్కీలు వెళ్లిపోవాలన్న ఐటీ మంత్రి..
IT News: ఇప్పటి వరకు కంపెనీలు సీరియస్ గా తీసుకున్న విషయం ఇప్పుడు ప్రభుత్వాల దాకా చేరుకుంది. ఇకపై మూన్లైటింగ్ వ్యవహారం సిల్లీగా తీసుకోవటం అస్సలు కుదరదు. నా రూటే సెపరేట్ అనుకునే వారు ఎవరైనా ఉంటే ఉద్యోగాలను మరచిపోక తప్పని పరిస్థితి వచ్చేసింది.
సిలికాన్ వ్యాలీలో..
అందరికీ టీసీఎస్ అంత దయాహృదయం ఉండదు. టెక్కీల కెరీర్ నాశనం కాకూడదనే ఉద్ధేశ్యంతో తాము రెండు ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవటం లేదని సీవోవో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఇలాంటి అనైతిక ఉద్యోగులకు ఇకపై చోటు ఉండబోదని తేలిపోయింది.
ఇండస్ట్రీ షాక్..
ఇప్పటి దాకా మాటలే.. అయితే ఇకపై మూన్లైటింగ్ కాన్సెప్ట్ విషయంలో సీరియస్ చర్యలు ఉండనున్నాయి. ఒకేసారి రెండు ఉద్యోగాలు అనేది తప్పని వారిస్తున్న కంపెనీలకు ఇప్పుడు ఐటీ మంత్రి సపోర్ట్ లభించటం టెక్కీల్లో వణుకు పుట్టిస్తోంది. అవును కర్ణాటక ఐటీ, ఎలక్ట్రానిక్స్ & స్కిల్స్ డెవలప్మెంట్ మంత్రి అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యలు సెన్సేషనల్ గా మారాయి.
మంత్రి మాటల్లోనే..
ఇన్ఫోసిస్, విప్రో టెక్ దిగ్గజాలకు మూన్లైటింగ్ విషయంలో అశ్వత్ నారాయణ్ ఫుల్ సపోర్ట్ ప్రకటించారు. ఆఫీస్ పనివేళలకు మించి ఫ్రీలాన్సింగ్ చెల్లింపులు చేయడం అక్షరాలా మోసం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలా రెండు ఉద్యోగాలు చేయాలనుకునే టెక్కీలు తమ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. అది అక్షరాలా మోసమని.. అదనపు గంటలు ఎలా పెర్ఫార్మ్ చేయగలవు..? వారేమైనా సూపర్మ్యానా..? వారికి కుటుంబం ఉండదా..? అంటూ సీరియస్ అయ్యారు.
ఢిల్లీలో కర్ణాటక మంత్రి..
తమ రాష్ట్రంలో మూన్లైటింగ్ చేసేవారికి చోటు లేదని.. అలాంటి వారు ఉండే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవచ్చంటూ ఢిల్లీలో మాట్లాడుతూ అశ్వత్ నారాయణ్ విరుచుకుపడ్డారు. బెంగళూరు టెక్ సమ్మిట్ను ప్రమోట్ చేయడానికి ఆయన దేశ రాజధానికి వచ్చినట్లు తెలుస్తోంది. కంపెనీలు ప్రభుత్వ సాయం కోరలేదని.. ఈ విషయాన్ని హ్యాండిల్ చేయటానికి వారికి పూర్తి స్వేచ్ఛ, ప్రణాళికలు ఉంటాయని మంత్రి బదులిచ్చారు.
కంపెనీలకు ఫుల్ పవర్స్..
ఏకంగా ఐటీ మంత్రి నుంచే మూన్లైటింగ్ వివాదంలో సపోర్ట్ తో పాటు ఫుల్ పవర్స్ రావటంతో టెక్కీలకు రానున్నది పరీక్షా సమయమనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ వ్యవహారంలో విప్రో 300 మందిని తొలగించింది. ఇకపై ఇలాంటి వారిని ఏరిపారేయటానికి కంపెనీలు ప్రభుత్వ ఏజెన్సీల సహాయం కూడా పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండియన్ సిలికాన్ వ్యాలీలో ఈ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.