అంబానీ-అదానీ కుమారుల చేతిలో నిర్ణయాలు..! ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకలా చేసింది..?
Adani-Ambani: దేశంలో రెండు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలుగా రిలయన్స్, అదానీ గ్రూప్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ గ్రూప్స్ ప్రస్తుతం కొత్త వారసులకు కంపెనీల బాధ్యతలను అప్పగించాయి. అలా కరణ్ అదానీ, అనంత్ అంబానీలు వారసులుగా కంపెనీల పురోగతి, వ్యూహాలు వంటి కీలక విషయాలను గమనిస్తూ వాటికి ముందుకు నడిపిస్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం..
ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాపార వారసులు కరణ్, అనంత్ లకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా.. రాష్ట్ర ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కొద్ది రోజుల క్రితం టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ఈ బృందం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి షిండే కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
ట్రిలియన్ డాలర్ ఎకానమీ..
మహారాష్ట్రను ఒక ట్రిలియన్ డాలర్లుగా మార్చేందుకు.. స్టేట్ ఎకనామిక్ అడ్వైజరీ బోర్డులో యువ వారసులకు చోటు దక్కింది. అలా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ కూడా అడ్వైజరీ గ్రూప్లో సభ్యులుగా నియమితులైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దీంతో వారి నిర్ణయాలు కూడా ప్రభుత్వానికి చాలా కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.
ఎవరు ఏం చేస్తారు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ అంబానీ విద్యుత్ రంగాన్ని, అదానీ పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరణ్ అదానీ ఓడరేవులు, ప్రత్యేక ఆర్థిక మండలాలకు సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొంటారని మహారాష్ట్ర సీఎంవో కార్యాలయం ప్రకటించింది. ఈ కమిటీలో మెుత్తం 21 మంది సభ్యులు ఉంటారని తెలుస్తోంది.
బృందంలో ఇతర సభ్యులు..
టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ నేతృత్వం వహిస్తున్న ఈ ఆర్థిక కమిటీలో.. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా, బైన్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ చంద్ర, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ CEO విక్రమ్ లిమాయే, లార్సన్ అండ్ టూబ్రో సీఈవో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రమణియన్, సన్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సంఘ్వీ, మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో అనీష్ షా, పాడ్వే ఇంజినీరింగ్ సీఈవో శ్రీ కాంత్ పద్వే ఉండనున్నారు.
దృష్టి వాటిపైనే..
2030 నాటికి మహారాష్ట్రను దేశంలో 1 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు నడిపేందుకు ఈ బృందం కృషి చేయనుంది. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, బ్యాంకింగ్కు సంబంధించిన అంశాలపై కూడా కమిటీ దృష్టి సారిస్తుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.