కాగ్నిజెంట్ షాకింగ్ నిర్ణయం: ఇన్ఫీ నుంచి HP వరకు.. ఈ కంపెనీ టెక్కీలకు షాక్!
న్యూఢిల్లీ: నాస్దాక్ లిస్టెండ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల బెంచ్ టైమ్ను తగ్గించింది. బిల్లింగ్ ప్రాజెక్టులపై లేని వారికి ఇదివరకు 60 రోజుల సమయం ఉండగా, ఇప్పుడు దానిని 35 రోజులకు తగ్గించింది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే 35 రోజుల తర్వాత కంపెనీ నుంచి వెళ్లిపోవాలని ఉద్యోగులను అడిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కాకుండా ఉద్యోగులకు నోటీసు పీరియడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇది మరో 60 రోజుల నుంచి 90 రోజులకు పెరిగే అవకాశం ఉంది.
ఐటీలో ఉద్యోగాల కోత, టెక్కీల్లో ఆందోళన!
కాగ్నిజెంట్ నిర్ణయం ఆందోళనకరం...
ఐటీ కంపెనీలు ఉద్యోగాల కోతకు సిద్ధం కావడంతో రానున్న నెలల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పెరగనుందని అంటున్నారు. ప్రాజెక్టులు లోని ఉద్యోగుల బెంచ్ టైమ్ గరిష్ట పరిమితిని కాగ్నిజెంట్ తగ్గించడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగించే అంశమే. బిల్లింగ్ ప్రాజెక్టులపై లేని ఉద్యోగుల బెంచ్ టైంను 35 రోజులకు తగ్గించడం గమనార్హం. 35 రోజుల తర్వాత ఈ ఉద్యోగులను సాగనంపుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలల నుంచి మూడు నెలలు పడుతుంది.
ఇదివరకు గ్రేస్ టైం
అంతకుముందు బెంచ్పై ఉన్న ఉద్యోగులకు తమ వ్యాపార యూనిట్లలో లేదా ఇతర ప్రాజెక్టుల్లో అవకాశం పొందేందుకు అధిక గ్రేస్ టైంను కల్పించేది కాగ్నిజెంట్. ఇతర నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపని ఉద్యోగులు, ఇతర డొమైన్లను ఎంచుకొని వారు మాత్రమే కంపెనీని వీడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.
నూతన బెంచ్ విధానం.. అందుకేనా
బెంచ్పై ఉన్న ఉద్యోగులకు ఇతర అవకాశాలివ్వకుండా నూతన టెక్నాలజీల్ని అందిపుచ్చుకునే నైపుణ్యాల్ని వారు విధిగా మెరుగుపరుచుకునేలా ఒత్తిడి పెంచేందుకే కాగ్నిజెంట్ నూతన బెంచ్ విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా భావిస్తున్నారని అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న కాగ్నిజెంట్ ఇటీవల పడిపోయింది. దీంతో చర్యలు చేపట్టింది. మారుతున్న క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలు పెంచేలా కసరత్తు చేపట్టింది.
అందుకే జాబ్ కట్
కాగ్నిజెంట్ ఈ నెల మొదటి వారంలో జాబ్ కట్ పైన ప్రకటన చేసింది. రానున్న నెలల్లో 10వేల మంది నుంచి 12వేల మందిని తగ్గించుకోనుంది. ఏ దేశంలో ఎంతమందిని తొలగిస్తారనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగ్నిజెంట్ ఉద్యోగుల్లో దాదాపు ముప్పావు వంతు వరకు మన దేశంలోనే పని చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విభాగాల నుంచి తాము వైదొలుగుతున్నామని, అందుకే ఉద్యోగాల కుదింపు అనివార్యమని కాగ్నిజెంట్ తెలిపింది.
ఇన్ఫోసిస్లో...
ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 నుంచి 150 మిలియన్ డాలర్ల మేరకు వ్యయాలను తగ్గించుకోవాలని చూస్తోంది. ఇందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగల తొలగింపు ఉంటుందని భావిస్తున్నారు.
HP 500 ఉద్యోగాల కోత
HP తన వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా రానున్న మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఏడువేల నుంచి తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో మన దేశం నుంచి 500 మందిపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
వియ్ వర్క్లో ఉద్యోగాల కోత
వియ్ వర్క్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 4,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ చైర్మన్ ఉద్యోగులకు రాసిన లేఖలో ఈ విషయాన్ని తెలిపారు. మన దేశంలో పని చేస్తున్న కొంతమందిపై ప్రభావం పడనుంది. హైదరాబాద్, ఢిల్లీ, నోడియా, బెంగళూరు, గురుగ్రామ్, పుణేల్లో వియ్ వర్క్ కార్యకలాపాలు ఉన్నాయి.
ఉద్యోగులను తగ్గించిన జొమాటో
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కొద్ది రోజుల క్రితం 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఆటోమేషన్ ఆధారిత టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. దీంతో ఉద్యోగుల సంఖ్య తగ్గించింది. వచ్చే ఏడాది కాలంలో ఐటీ రంగంలో 30 వేల నుంచి 40 వేల మంది మధ్యస్థాయి ఉద్యోగులను కంపెనీలు తొలగించే అవకాశముందని ఐటీ నిపుణులు మోహన్ దాస్ పాయ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.