జియో ఫోన్ నెక్స్ట్, ప్రపంచంలో తక్కువ ఖరీదు కలిగిన ఫోన్
జియో ఫోన్ నెక్స్ట్ సెప్టెంబర్ 10వ తేదీ నుండి మార్కెట్లో అందుబాటులో ఉంటుందని ముఖేష్ అంబానీ తెలిపారు. రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రిలయన్స్-గూగుల్ భాగస్వామ్యంతో జియో ఫోన్ నెక్స్ట్ను అభివృద్ధి చేశామని, దీనిని గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీ నుండి అందుబాటులో ఉంటుందన్నారు. ఇది పూర్తిస్థాయి స్మార్ట్ఫోన్ అని వెల్లడించారు. ఇది గూగుల్, జియో సూట్లలోని మొత్తం అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుందని, ఇందులో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఉందన్నారు. దీనిని గూగుల్తో కలిసి అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
అత్యంత చౌక స్మార్ట్ ఫోన్
జియో ఫోన్ నెక్స్ట్ భవిష్యత్తులో భారత్లోనే కాదని, ప్రపంచంలో అత్యంత చౌక స్మార్ట్ఫోన్గా నిలుస్తుందని, గూగుల్ క్లౌడ్ను జియో వినియోగిస్తోందని, వాట్సాప్-జియోమార్ట్ అనుసంధానంపై జియో, ఫేస్బుక్లు పరీక్షలు నిర్వహిస్తున్నాయన్నారు. జియో ఫైబర్ కరోనా సమయంలో అనుకున్నంత వేగంగా విస్తరించలేదని, అయినా 20 లక్షల మంది కొత్త కస్టమర్లకు చేరిందని తెలిపారు.
వేగవంతమైన ఇంటర్నెట్
గూగుల్ క్లౌడ్, జియో మధ్య కుదిరిన 5G భాగస్వామ్యం దాదాపు 100 కోట్ల మంది భారతీయులకు వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తుందని, ఇది వారి డిజిటల్ మార్పులు, వ్యాపారాలకు సహకరిస్తుందని, తర్వాత తరం భారత్ డిజిటలైజేషన్కు పునాది వేస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. భారత్లో వ్యాపారాలు, వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే తమ ఒప్పందం లక్ష్యమన్నారు.
రిలయన్స్ అదుర్స్
రిలయన్స్ గత ఏడాది అద్భుతమైన పనితీరు కనబరిచిందని, కంపెనీ సమీకృత ఆదాయం రూ.54,000 కోట్లకు చేరుకుందని, కన్సాలిడేటెడ్ ఎబిటా రూ.98,000 కోట్లుగా ఉందని, వీటిలో 50 శాతం కన్జ్యూమర్ వ్యాపారం నుండి లభించిందని, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతుల్లో 6.8 శాతం వాటాను అందించిందని ముఖేష్ అంబానీ తెలిపారు. తమ కంపెనీలో 75,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చామని, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకం కింద రూ.21,044 కోట్లు, జీఎస్టీ కింద రూ.85,306 కోట్లు, వ్యాట్ రూపంలో రూ.3,213 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించామన్నారు.