రైతు ఉద్యమం-MNP war: జియో సంచలన ఆరోపణ, ఎయిర్టెల్, VI ఏమన్నదంటే?
వొడాఫోన్ ఐడియా(VI), ఎయిర్టెల్ సంస్థలపై రిలయన్స్ జియో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)కు ఫిర్యాదు చేసింది. రెండు టెల్కోలు అనైతికంగా మొబైల్ నెంబర్ పోర్టబులిటీ(MNP)కి పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లేఖ రాసింది. దేశంలో పలు ప్రాంతాల్లో రైతు ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రైతు ఉద్యమంలో టెల్కోలు అనైతికంగా ఎంఎన్పీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు గుప్పించింది.
ఏడాదిలో వీరి సంపద రూ.4.7 లక్షల కోట్లు పెరిగింది
10న ట్రాయ్కు లేఖ
ఎయిర్టెల్, VI టెల్కోలు తమ ఉద్యోగులు, ఏజెంట్లు, రిటైలర్ల ద్వారా అనైతిక ఎంఎన్పీకి పాల్పడుతున్నాయని జియో లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. జియో నుండి తమ నెట్ వర్క్కు మారడం అంటే రైతులకు మద్దతు తెలపడమేనని చెబుతున్నట్లు ఈ నెల 10వ తేదీన ట్రాయ్కు రాసిన లేఖలో తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు అంటూ ఫోటో కాపీలను జత చేసింది.
తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి
కేంద్రం తీసుకు వచ్చిన రైతు సంస్కరణల చట్టాల వల్ల రిలయన్స్ లాభపడుతుందనే తప్పుడు ప్రచారం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని జియో కోరింది. ఈ వ్యవసాయ చట్టాల వల్ల రిలయన్స్కు ప్రయోజనమని కంపెనీలు ఉద్దేశ్యపూర్వకంగా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అనైతిక, తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. ఈ అసత్య ప్రచారాన్ని నమ్మి తమ కస్టమర్లు పోర్ట్ ఔట్ రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. రైతు ఉద్యమాన్ని ప్రత్యర్థి కంపెనీలు జియోను దెబ్బకొట్టేందుకు వినియోగించేందుకు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించింది. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించింది. ఎంఎన్పీ కోసం తప్పుడు ప్రచారాన్ని కేవలం ఉత్తరాదికే పరిమితం చేయలేదని, దేశమంతా చేస్తున్నట్లు ఆరోపించింది.
ఎయిర్టెల్, వొడాఫోన్ స్పందన
జియో ఆరోపణలపై భారతీ ఎయిర్టెల్ స్పందించింది. ఈ ఆరోపణలు దారుణమని ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్... ట్రాయ్కు రాసిన లేఖలో తెలిపారు. తాము 25 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నామని, ఈ కాలంలో మార్కెట్లో తీవ్రపోటీని ఎదుర్కొన్నామని, ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేశామని, అదే సమయంలో పోటీదారులను, భాగస్వాములను ఎంతో గౌరవిస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. తాము పారదర్శకంగా వ్యాపారం చేస్తామని, ఇందుకు తామెంతో గర్వపడుతున్నామని పేర్కొంది.
తమపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని VI అధికార ప్రతినిధి కూడా తెలిపారు.