మొన్నటిదాకా వాహనదారులపై భారం: ఇక ఆ ఇంధన రేట్ల మోత: 3 నెలల్లో మూడోసారి పెంపు
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు ఎల్పీజీ వంట గ్యాస్, కమర్షియల్ సిలిండర్ల రేట్లను సైతం చమురు సంస్థలు భారీగా పెంచేశాయి. పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి అనేక నగరాల్లో 110 నుంచి 120 రూపాయల మధ్య ఉంటోంది. డీజిల్ పరిస్థితీ దాదాపు ఇంతే. 100 నుంచి 110 రూపాయల మేర పలుకుతోంది. ఈ పెంపుదల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.
ఇప్పుడు తాజాగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) రేట్లు కూడా పెరిగాయి. ఏకంగా అయిదు శాతం మేర వాటి రేట్లను పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా- విమాన ఛార్జీలు మరింత భారంగా పరిణమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏటీఎఫ్ రేట్లు పెరగడం ఈ సంవత్సరంలో ఇది తొమ్మిదో సారి. ఇవ్వాళ్టి పెంపుతో ఏటీఎఫ్ ధరలు ఆల్టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఈ విషయంలో తన రికార్డులను తానే బద్దలు కొడుతోందీ ఏటీఎఫ్ ప్రైస్. ఇదివరకెప్పుడూ లేని రేటును అందుకున్నాయవి.
మార్చిలో 18.3 శాతం మేర విమాన ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్టు- ఏప్రిల్లో రెండుసార్లు వాటి జోలికి వెళ్లాయి చమురు కంపెనీలు. ఏప్రిల్ 1న రెండుశాతం, 16న 0.2 శాతం మేర పెంచేశాయి. ఫలితంగా- అప్పటికే విమాన ఇంధన ధరలు ఆల్టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ భారం పడింది. అయిదు శాతం వాటి రేట్లు పెరిగాయి. అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతుండటం వల్ల విమానయాన సంస్థలు తమ టికెట్ల ధరలను పెంచే అవకాశాలు లేకపోలేదు.
తాజా పెంపుతో ఢిల్లీలో ఏటీఎఫ్ కిలో లీటర్ ఒక్కింటికి 1,23,039.71 రూపాయలకు చేరింది. ముంబైలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్ మీద 1,21,847.11, కోల్కతలో 1,27,854.60, చెన్నైలో 1,27,286.13 రూపాయలు పలుకుతోంది. విమానయాన సంస్థలు భరించే ఖర్చుల్లో 40 శాతం వాటా జెట్ ఫ్యూయల్దే. ఈ స్థాయిలో జెట్ ఫ్యూయల్ రేట్లు పెరగడం వల్ల విమానయాన సంస్థలు ప్రయాణ ఛార్జీలను పెంచే విషయంపై దృష్టి సారించాయి.
ఫ్లెక్సిబుల్ టికెటింగ్ సిస్టమ్లో బేస్ ప్రైస్ను భారీగా పెంచడానికి చర్యలు తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. బేసిక్ టికెట్ ప్రైస్ను పెంచడం వల్ల డిమాండ్కు అనుగుణంగా వాటి రేట్లు వేల రూపాయలకు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. దూర ప్రయాణాలు చేసే వారిపై ఇది అదనపు భారంలా మారుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర పెరిగిన నేపథ్యంలో- చమురు సంస్థలు తాజాగా ఏటీఎఫ్ రేట్లను సవరించినట్లు చెబుతున్నారు.