Forbes List: జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీయే టాప్! 4గురు తెలుగువారికి చోటు
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ కుబేరుల సంపద ఈ ఏడాది భారీగా ఆవిరైంది. ఫోర్బ్స్ ధనవంతుల తాజా జాబితాలో బిలియనీర్ల ఆస్తులు కరిగిపోయినట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, భారత్లో ముఖేష్ అంబానీ మొదటి స్థానాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. ఇండియా నుండి డిమార్ట్ రాధాకిషన్ ధమానీ, ఉదయ్ కొటక్, శివనాడర్లకు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది.
కరోనా లాక్డౌన్: సౌత్ ఇండియాపై తక్కువ ప్రభావం, ఎందుకో తెలుసా?
భారత్ నుండి ఈ వీరికి చోటు..
భారత కుబేరుడు ముఖేష్ అంబానీ 44.3 బిలియన్ డాలర్లతో 17వ స్థానంలో నిలిచారు. గతంతో పోలిస్తే ఈయన సంపద భారీగా తగ్గిపోయింది. రిటైల్ దిగ్గజం డిమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ ఆయన కుటుంబం సంపద విలువ 13.8 బిలియన్ డాలర్లుగా ఉంది. జాబితాలో 78వ స్థానంలో నిలిచారు. టాప్ 100లో భారత్ తరఫున ముఖేష్, ధమానీ మాత్రమే నిలిచారు. శివ్ నాడర్, ఉదయ్ కొటక్లు వరుసగా 114, 116 ర్యాంకులు దక్కించుకున్నారు.
జెఫ్ బెజోస్ టాప్
అంతర్జాతీయంగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 113 బిలియన్ డాలర్లతో వరుసగా మూడో ఏడాది టాప్ 1గా నిలిచారు. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ (98 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో, ఎల్వీఎంహెచ్ సీఈవో అండ్ చైర్మన్ బెనార్డ్ అర్నాల్డ్ మూడో స్థానంలో ఉన్నారు. వారన్ బఫెట్ నాలుగో స్థానంలో నిలిచారు. జాక్ మా ఆస్తులు 40.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
నలుగురు తెలుగువారు..
ఫోర్బ్స్ 2,095 మందితో ఈ జాబితాను విడుదల చేసింది. 100 మందికి పైగా భారతీయులు ఉండగా, నలుగురు మహిళలు ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో నలుగురు తెలుగు వారికి చోటు దక్కింది.. 3.5 బిలియన్ డాలర్లతో దివీస్ ల్యాబ్స్ అధినేత మురళీ దివీ, ఆయన ఫ్యామిలీకి చోటు దక్కింది. ఆ తర్వాత స్థానాల్లో పిచ్చిరెడ్డి (1.6 బిలియన్ డాలర్లు), పీవీ కృష్ణా రెడ్డి (1.6 బిలియన్ డాలర్లు), అరబిందో ఫార్మా చీఫ్ పీవీ రాంప్రసాద్ రెడ్డి (1.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. ఇద్దరు ఔషధ రంగానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు మౌలిక రంగంలో ఉన్నారు.
టాప్ 100లో ముఖేష్, ధమానీ
ముఖేష్ అంబానీ 44.3 బిలియన్ డాలర్లు లేదా రూ.3 లక్షల 38 వేల కోట్లతో ప్రపంచంలో 17వ స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత రాధాకిషన్ ధమానీ రూ.16.6 బిలియన్ డాలర్లతో 65వ స్థానంలో నిలిచారు. 2002లో ధమానీ ముంబైలో బిజినెస్ స్థాపించి, ఈ రోజు ఫోర్బ్స్ లిస్టులో నిలిచారు.
114వ స్థానంలో శివనాడర్
HCL టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడర్ రూ.12.4 బిలియన్ డాలర్లతో 114వ స్థానంలో నిలిచారు. ఈయన తన ఆస్తుల్లో ఎక్కువ మొత్తాన్ని దాతృత్వ కార్యకలాపాలకు వినియోగిస్తారు. 66.2 మిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని శివ్ నాడర్ ఫౌండేషన్కు కేటాయించారు.
ఉదయ్ కొటక్
హిందూజా సోదరులు, ఉదయ్ కొటక్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. హిందూజా సోదరుల ఆస్తులు 12.2 బిలియన్ డాలర్లు, కొటక్ బ్యాంకు యజమాని ఉదయ్ కొటక్ ఆస్తులు 10.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఇది ఒకటి.
సునీల్ మిట్టల్, అదానీ కూడా
భారతీ ఎయిర్టెల్ ఓనర్ సునీల్ మిట్టల్ 9.5 బిలియన్ డాలర్లతో 154వ స్థానంలో, సైరస్ పూనావాలా 161 స్థానంలో, గౌతమ్ అదానీ 162వ స్థానంలో నిలిచారు. స్టీల్ కింగ్ లక్ష్మీ నివాస్ మిట్టల్ 170వ స్థానంలో ఉన్నారు.