ప్రధాని మోడీ కీలక ప్రకటన: ఇక ప్రతి సంవత్సరం జనవరి 16వ తేదీన..!
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. కీలక ప్రకటన వెలువడించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 150 స్టార్టప్స్ యజమానులు, వాటి ప్రతినిధులతో ఆయన ఇవ్వాళ సమావేశం అయ్యారు. వర్చువల్ విధానంలో ఈ భేటీ సాగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నరేంద్ర మోడీ వారితో మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కీలక విషయాలను ప్రస్తావించారు.
దేశానికి వెన్నెముక
దేశానికి స్టార్టప్స్ వెన్నెముకగా మారబోతోన్నాయని ప్రధానమంత్రి అభివర్ణించారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొనే సమయానికి భారత్ పునర్నిర్మాణంలో స్టార్టప్స్ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దేశీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ ప్రతినిధులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారని, తమ సృజనాత్మకతతో వినూత్న ఉత్పత్తులను తయారు చేస్తోన్నాయని మోడీ ప్రశంసించారు. అంతర్జాతీయ మార్కెట్లో దేశం గర్వించ దగ్గ స్థాయికి చేర్చుతున్నాయని కితాబిచ్చారు.
టెక్కడేగా ఈ దశాబ్దం..
2014 నుంచి 2024 వరకు దశాబ్దాన్ని టెక్కాడెగా పిలవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యువర్షిప్, స్టార్టప్ ఎకో సిస్టమ్ దేశ పారిశ్రామిక రంగం రూపురేఖలను మార్చబోతోన్నాయని ఆయన చెప్పారు. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం అనుసరిస్తోన్న సరళీకరణ విధానాలు, బ్యూరోక్రసీ వ్యవస్థ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తోన్నాయని వ్యాఖ్యానించారు. ఈ దిశగా అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
జనవరి 16వ తేదీని నేషనల్ స్టార్టప్ డేగా
స్టార్టప్స్కు మరింత ప్రోత్సహించేలా ప్రతి సంవత్సరం జనవరి 16వ తేదీని జాతీయ స్టార్టప్ దినోత్సవంగా ప్రకటిస్తున్నానని ప్రధాని అన్నారు. ఇకపై ప్రతి జనవరి 16వ తేదీ నాడు నేషనల్ స్టార్టప్ డే వేడుకలను జరుపుకొందామని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానాల గురించి వివరించాలని చెప్పారు. వ్యవసాయం, వైద్య-ఆరోగ్యం, ఎంటర్ప్రైజ్ సిస్టమ్, ఇండస్ట్రీ 4.ఓ, ఫిన్టెక్, ఎన్విరాన్మెంట్ వంటి.. అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి..
ప్రతి స్టార్టప్ కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ప్రధాని అకాంక్షించారు. ఆ స్థాయిలో కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలని సూచించారు. లోకల్ టు వోకల్ నినాదాన్ని తాము అందుేక తీసుకొచ్చామని గుర్తు చేశారు.
భారత్ నుంచి..భారత్ కోసం అనే ఉద్దేశంతో పని చేయాలని ఆయన స్టార్టప్ ప్రతినిధులను కోరారు. దేశంలో 625 జిల్లాల్లో ఒక్క స్టార్టప్ అయినా ఉండి తీరాలని చెప్పారు. టయర్-2, టయర్-3 సిటీస్లల్లో సగానికి పైగా స్టార్టప్స్ ఉన్నాయని, గ్రామస్థాయి వరకు వాటిని తీసుకెళ్లాలని అన్నారు.
16 వరకు వారోత్సవాలు..
ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల 10వ తేదీన ఈ వారోత్సవాలను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లాంఛనంగా ప్రారంభించింది. ఆదివారం ఈ వారోత్సవాలు ముగియనున్నాయి. దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ.. స్టార్టప్స్ ప్రతినిధులు, యజమానులతో ఈ వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు.