ఉద్యోగార్థులకు ఐటీ సెక్టార్ ఆకర్షణీయం: టీసీఎస్ రాజేష్ గోపినాథన్
ఉద్యోగార్థులకు ముందుముందు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) రంగం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉంటుందని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ అన్నారు. లింక్డిన్ లైవ్ ఇంటరాక్షన్లో ఆయన మాట్లాడారు. భారత ఐటీ రంగ ఎంప్లాయిమెంట్ బలంగా కొనసాగుతోందని, ఇది మున్ముందు కూడా పెరుగుతూనే ఉంటుందన్నారు. టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని, ఈ నేపథ్యంలో టాలెంట్, ఐటీ సేవలకు డిమాండ్ ఇలాగే కొనసాగుతుందన్నారు.
ఐటీ కంపెనీలకు చిక్కులు, ఖాళీగా ఉద్యోగులు! లాభాలపై ప్రభావం
వేగవంత డిజిటలీకరణ
కరోనా మహమ్మారి గురించి రాజేష్ గోపినాథన్ మాట్లాడుతూ... ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అనేక విభాగాల్లో రాణించినట్లు తెలిపారు. సవాళ్లను అవకాశంగా మలుచుకుంటున్నట్లుగా అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ డిజిటల్ మార్గంలోకి మారడాన్ని మరింత వేగవంతం చేసిందన్నారు.
డిజిటల్.. సద్వినియోగం
యువ ఉద్యోగార్థులకు ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒకవేళ ఎలాంటి రెప్యుటేషన్ లేని సంస్థలో ఉండి ఉన్నప్పటికీ, గతంలో ఎన్నడూ లేనంత మెరుగైన స్థితిలో ఉన్నట్లుగానే భావించాలన్నారు. కరోనా తర్వాత టెక్నాలజీకి మరింతగా డిమాండ్ పెరుగుతోందని, ఉద్యోగార్థులకు ఐటీ రంగం ఆకర్షణీయ గమ్యస్థానంగానే ఉంటుందన్నారు. భారత ఐటీ రంగంలో ఉపాధి బలంగా కొనసాగుతోందన్నారు. గత ఐదు నెలలుగా డిజిటల్కు మరింతగా డిమాండ్ పెరిగిందని, టీసీఎస్ వంటి కంపెనీలు దీనిని సద్వినియోగం చేసుకోవడంలో ముందంజలో ఉన్నాయన్నారు.
ఐటీ వ్యయం పెరుగుదల
రాబోయే నాలుగేళ్లలో ఐటీ వ్యయం 4-5 శాతం నుండి 6-8 శాతానికి పెరుగుతుందనే అంచనాలు వెల్లడయ్యాయి. ఐటీ జాబ్ ల్యాండ్ స్పేస్లో భారీ డిమాండ్ ఉంది. క్లౌడ్, డేటా, అలటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాల కోసం డిమాండ్ పెరిగినప్పటికీ, పరివర్తన చెందలేనివారు ఉద్యోగం కోల్పోతున్నారని ఐటీ నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కరోనా కారణంగా లక్ష మంది టెక్కీలు కోల్పోతారని అంచనాలు ఉన్నాయి.