New IT rules: ఐటీ రూల్స్ వాట్సాప్కు మాత్రమే కాదు, అలాగే భారత్ ఒక్కటే చెప్పడం లేదు
సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ నిబంధనలు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని మెసేజింగ్ యాప్ వాట్సాప్ అభిప్రాయపడింది. బుధవారం నుండి కొత్త ఐటీ నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా వాట్సాప్ కోర్టును వెళ్లింది. ఈ నిబంధనలను తక్షణమే నిలిపివేయాలని కోరింది. ఐతే గూగుల్ మాత్రం ఈ నిబంధనలు పాటిస్తామని తెలిపింది. కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తామని వెల్లడించింది. వాట్సాప్ కోర్టుకెక్కడం చర్చనీయాంశంగా మారింది.
ICICI Prudential Retirement Plan: గ్యారెంటీ పెన్షన్ ప్లాన్
కొత్త నిబంధనలు అమల్లోకి
కొత్త ఐటీ నిబంధనల వల్ల యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని వాట్సాప్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కేంద్రం, వాట్సాప్ మధ్య వివాదం రాజుకుంది. కొత్త నిబంధనల అమలుకు కసరత్తు చేస్తున్నామని మాతృసంస్థ ఫేస్బుక్ వెల్లడించింది. అయినప్పటికీ వాట్సాప్ కోర్టుకెక్కడం గమనార్హం. వాస్తవానికి డిజిటల్ కంటెంట్ పైన నియంత్రణకు కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
వాట్సాప్కు మాత్రమే కాదు
వాట్సాప్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దీటుగా స్పందించింది. దేశ సార్వభౌమత్వం, శాంతిభద్రతలకు సంబంధించిన తీవ్రమైన అంశాల్లో ప్రభుత్వం యూజర్ల వ్యక్తిగత సమాచారం కోరుతుందని స్పష్టం చేసింది. ఐటీ రూల్స్ కేవలం వాట్సాప్కు మాత్రమే కాదని, అలాగే ఇలా ఐటీ నియన నిబంధనలు అమలు చేయడం కేవలం భారత దేశం మాత్రమే చేయడం లేదని కేంద్రం పేర్కొంది. సాధారణ వాట్సాప్ యూజర్లకు ఐటీ నిబంధనలతో ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ఐటీ శాఖమంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు.
ఐటీ నిబంధనలు
వాస్తవానికి డిజిటల్ కంటెంట్ పైన నియంత్రణకు కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలకు మాత్రం అమలు కోసం 3 నెలల గడువు కల్పించింది. అది మంగళవారంతో ముగిసింది. దీంతో బుధవారం నుండి కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్కు సోషల్ మీడియా వేదికలన్నీ కట్టుబడి ఉండాలి. లేదంటే ఇన్నాళ్లూ వాటికి రక్షణగా నిలుస్తున్న మధ్యవర్తి హోదా రద్దవుతుంది. అప్పుడు ఆయా సంస్థలు క్రిమినల్ కేసులు, ఇతర చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.