IT refunds: సెప్టెంబర్ 6 నాటికి రూ.70,120 కోట్లు రీఫండ్
సెప్టెంబర్ 6వ తేదీ నాటికి ఆదాయపు పన్ను శాఖ రూ.70,120 కోట్ల కోట్లను రీఫండ్ చేసినట్లు వెల్లడించింది. ఇందులో 24.70 లక్షల వ్యక్తి గత పన్ను చెల్లింపుదారులకు రూ.16,753 కోట్లు రీఫండ్స్ ఉన్నాయని పేర్కొంది. ఇక కార్పొరేట్ విభాగంలో 1.38 లక్షల మందికి రూ.53,367 కోట్ల మేర రీఫండ్ చేసినట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మొత్తం 26,609 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఈ మొత్తాన్ని రీఫండ్ చేసినట్లు సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్ ద్వారా తెలిపింది.
'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) సెప్టెంబర్ 6, 2021 నాటికి రూ.70,120 కోట్ల రీఫండ్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ మధ్య 26.09 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్కు ఈ మొత్తం చెల్లించడం జరిగింది' అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.
కాగా, ఆదాయపు పన్ను శాఖ ఐటీ రిటర్న్స్ గడువును ఇటీవల పొడిగించిన విషయం తెలిసిందే. 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు CBDT గురువారం ప్రకటించింది. కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల కారణంగా గతంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువును ఇచ్చింది. మరోవైపు, ఐటీ రిటర్న్స్ దాఖలు కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూపొందించిన కొత్త ఐటీ వెబ్ పోర్టల్లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాలేదు. దీంతో సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్న గడువును ఐటీ శాఖ డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్సైట్(www.incometax.gov.in)ను ఇన్ఫోసిస్ అందుబాటులోకి తీసుకురాగా అప్పటి నుండి టెక్నికల్ సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఈ వెబ్సైట్ను రూపొందించిన ఇన్ఫోసిస్కు కేంద్రం డెడ్లైన్ విధించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సోమవారం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సలీల్ పరేఖ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గడువును నిర్దేశించారు.
సెప్టెంబర్ 15వ తేదీలోగా పోర్టల్కు సంబంధించిన లోపాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పోర్టల్ అందుబాటులోకి వచ్చిన మూడు నెలలకు వస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. సమస్యలు కొనసాగుతుండటంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో గడువును పొడిగించింది.