ఐటీలో కొత్తగా 4.5 లక్షల ఉద్యోగాలు, భారత ఐటీ అదుర్స్
భారత ఐటీ కంపెనీలు అదరగొడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల కొత్త ఉద్యోగాలను జత చేయడంతో చేసింది. అలాగే, ఈ సంవత్సరం ముగిసేనాటికి రూ.17.02 లక్షల కోట్లకు (227 బిలియన్ డాలర్లు) చేరుకోనుందని అంచనా. తద్వారా 15.5 శాతం వార్షిక వృద్ధి సాధించినట్లు అవుతుంది. కరోనా వైరస్ వల్ల ముందుకు వచ్చిన అత్యంత సంక్షోభ పరిస్థితుల్లో ఇలాంటి ఘనత సాధించడం అపూర్వమైన అంశమని నాస్కామ్ అధ్యక్షురాలు దేవయానీ ఘోష్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమ పరిమాణం 197 బిలియన్ డాలర్లు. అప్పుడు 2.2 శాతం వృద్ధి నమోదయింది.
వేగంగా వృద్ధి
కరోనా ముందునాటి 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఐటీ వృద్ధి రెండింతలకు పైగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. FY22లో ఐటీ పరిశ్రమలో 4.5 లక్షల కొత్త ఉద్యోగాలు లభించినట్లు నాస్కామ్ తన వ్యూహాత్మక సమీక్ష పత్రంలో తెలిపింది. ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉద్యోగాల సంఖ్య 50 లక్షలకు పెరిగినట్లు తెలిపింది. కొత్తగా ఐటీలో ఉద్యోగాలు దక్కించుకున్న వారిలో 44 శాతం మంది మహిళలున్నారు.
కస్టమర్ సెంట్రిసిటీపై నిరంతర దృష్టి కారణంగా సాంకేతిక పరిశ్రమకు ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని అభిప్రాయపడింది. గత పదేళ్లలో పరిశ్రమ 100 బిలియన్ డాలర్లను జోడించిందని, అంతకుముందు మొదటి 100 బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి 30 ఏళ్లు పట్టిందని నాస్కామ్ తెలిపింది.
ఐటీ సేల్స్ ఆదాయం
మొత్తం మీద మన దేశం నుండి ఐటీ ఎగుమతులు 17 శాతం వృద్ధితో 178 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే సమయంలో దేశీయ ఐటీ సేల్స్ ఆదాయం పది శాతం పెరిగి 49 బిలియన్ డాలర్లకు చేరింది. కొత్త తరం డిజిటల్ సేవల వాటా 25 శాతం వృద్ధితో 13 బిలియన్ డాలర్లుగా నమోదయింది. మన దేశానికి ఉన్న ఐటీ నైపుణ్యం, మానవవనరుల లభ్యత, సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో ఐటీ రంగంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోందని తెలిపారు.
సర్వే ప్రకారం
సీఈవోల సర్వే ప్రకారం చూస్తే మరో ఏడాది పాటు ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది ఐటీ రంగానికి సంబంధించి ఎంతో సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. 2026 నాటికి 350 బిలియన్ డాలర్లకు దేశీయ ఐటీ పరిశ్రమ ఎదిగే అవకాశముందని చెబుతున్నారు.