పీఎఫ్ అడ్వాన్స్ ఎక్కువగా తీసుకుంది టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ ఉద్యోగులు!
కరోనా వైరస్ నేపథ్యంలో శాలరీ కోత, ఉద్యోగాల కోత వంటి వివిధ కారణాలతో ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితుల్లో ఈపీఎఫ్ ఖాతాల నుండి అమౌంట్ విత్ డ్రా చేసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం కూడా పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట మొత్తాన్ని తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ప్రధాన ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కరోనా విండో కింద పెద్ద ఎత్తున అడ్వాన్స్లు తీసుకున్నారు. ఇందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ కంపెనీల ఉద్యోగులు ఏప్రిల్-జూలై కాలంలో ఈపీఎఫ్ నుండి ఉపసంహరించుకున్నారు.
EPFO: స్వయంఉపాధి పొందేవారికి మోడీ ప్రభుత్వం పీఎఫ్ గుడ్న్యూస్!
టాప్ 5లో మూడు ఐటీ కంపెనీలు
TCS కంపెనీలో 33,000 మంది ఉద్యోగులు కోవిడ్ 19 ఫండ్ కింద రూ.1.5 కోట్ల మొత్తాన్ని ఈపీఎఫ్ నుండి తీసున్నారు. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య పరంగా కరోనా అడ్వాన్స్ పొందిన టాప్ 5 కంపెనీల్లో మూడు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ ఉన్నాయి. కంపెనీల్లోని ఉద్యోగులపరంగా ఇది 17 శాతం.
టాప్ 5 కంపెనీలు ఇవే...
కోవిడ్ 19 ఫండ్ కింద పీఎఫ్ అమౌంట్ తీసుకున్న వారిలో 33వేల మందితో టీసీఎస్ ఉద్యోగులు మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత HDFC బ్యాంకు నుండి 12,921 మంది, HCL 11,957 మంది, ఇన్పోసిస్ 5,534 మంది, మారుతీ నుండి 2,146 మంది ఉన్నారు. ఏప్రిల్ - జూలై మధ్య 8 మిలియన్ల ఉద్యోగులు రూ.30,000 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. 60 మిలియన్ల ఉద్యోగులు, వారి యజమానుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ.10 లక్షల కోట్ల కార్పస్ను ఈపీఎఫ్ఓ నిర్వహిస్తోంది. ఈపీఎఫ్ఓలోకి ఎప్పుడు ఎక్కువగా నిధులు వస్తాయి. కానీ కరోనా కారణంగా ఈసారి పెద్ద మొత్తంలో ఉపసంహరణలు చోటు చేసుకున్నాయి. ఇది ఫండ్ ఆదాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కరోనా సమయంలో ఊరట
కరోనా కష్టాల నుండి గట్టెక్కేందుకు ఖాతాలో ఇప్పటి వరకు జమ అయిన సొమ్ములో 75 శాతాన్ని లేదా మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఏది తక్కువ అయితే దానిని తీసుకోవచ్చు. KYC(నో యువర్ కస్టమర్) వివరాలు సమర్పించిన సబ్స్క్రైబర్లకి ఈ లాక్డౌన్ సమయంలో EPFO సిబ్బంది ప్రమేయం లేకుండా నగదు విత్ డ్రా చేసుకునే ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయం అందుబాటులో ఉంది.