IT రిటర్న్స్ ఫైలింగ్ చేయని వారి నగదు విత్ట్రాపై ఆదాయపుపన్ను శాఖ కీలక నిర్ణయం
పాన్ కార్డు ఆధారంగా కంపెనీలు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్ స్థితిని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తనిఖీ చేయడానికి వెసులుబాటును కల్పిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ బుధవారం తెలిపింది. ఈ మేరకు దీనిని ప్రారంభించినట్లు ఐటీ డిపార్టుమెంట్ వెల్లడించింది. ఆదాయపుపన్ను రిటర్న్స్ ఎప్పుడూ దాఖలు చేయని వారు కూడా బ్యాంకుల నుండి భారీ మొత్తంలో నగదును ఉపసంహరించుకుంటున్నట్లు డేటా సూచిస్తోంది.
బ్యాంకుల చేతికి పన్ను చెల్లింపుదారుల వివరాలు, టీడీఎస్ ఇబ్బందులకు చెక్!
రూ.20 లక్షల విత్డ్రాకు అనుమతి
ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని నిర్ధారించుకోవడానికి, అలాగే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారు నగదు ఉపసంహరిస్తే వారిపై నిఘా ఉంచడానికి, తద్వారా నల్లధనాన్ని అరికట్టడానికి ఆదాయపుపన్ను శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు ఆధారంగా వివరాలు పొందవచ్చు. అలాగే, ఫైనాన్స్ యాక్ట్ 2020, సవరించిన ఐటీ చట్టం 1961 ప్రకారం నగదు విత్ డ్రా పరిమితిని రూ.20 లక్షలకు పరిమితం చేసింది.
రూ.1 కోటికి మించి ఉపసంహరిస్తే..
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారు రూ.1 కోటికి మించి ఉపసంహరిస్తే నగదు ఉపసంహరణపై 5 శాతం అధిక రేటుతో టీడీఎస్ను విధించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఐటీ అధికారులు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులతో ట్యాక్స్ పేయర్స్ సమాచారాన్ని పంచుకోవచ్చునని సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు ఐటీ డిపార్టుమెంట్ కొత్త కార్యాచరణను విడుదల చేసింది. ఐటీఆర్ ఫైలింగ్ కాంప్లియెన్స్ చెక్ వాణిజ్య బ్యాంకులకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా బ్యాంకులు బల్క్ మోడ్లో పాన్ నెంబర్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
నోటిఫై..
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు అందించే సమాచార ఫార్మాట్, ప్రొసీజర్కు ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కం ట్యాక్స్(సిస్టమ్) నోటిఫై చేసినట్లు సీబీడీటీ తెలిపింది. కాగా, ఆదాయపు పన్ను శాఖ ఇటీవల పలు సంస్కరణలు చేపడుతోన్న విషయం తెలిసిందే.