షాకింగ్: 'ఐటీ కంపెనీలకు మరో మార్గం లేదు, 10% ఉద్యోగాల కోత తప్పదు'
బెంగళూరు: ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని వంటీ టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగుల్లో కొంతమందిని తొలగిస్తాయనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల (IT) జాబ్ కట్ అంశంపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, ఐటీ ఇండస్ట్రీ నిపుణులు వీ బాలకృష్ణన్ గురువారం స్పందించారు. మార్జిన్ ఒత్తిడిని నివారించేందుకు, మరింత చురుగ్గా ఉండేందుకు ఐటీ కంపెనీలు 5 శాతం నుంచి 10 శాతం మధ్య ఉద్యోగులను తొలగించడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు.
ఇన్ఫోసిస్ టు కాగ్నిజెంట్.. ఉద్యోగాల తొలగింపు
మధ్యస్థాయిలోని ఉద్యోగులను తగ్గించాలి..
ఐటీ కంపెనీల్లో మిడిల్ లేయర్ ఉద్యోగులు 20 శాతం నుంచి 30 శాతం మధ్య ఉంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో వీ బాలకృష్ణన్ మాట్లాడారు. మధ్యస్థాయిలోని ఉద్యోగుల్లో కనీసం 10 శాతం వరకు తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. మధ్యస్థాయిలోని ఉద్యోగులు అవసరానికి మించి ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యస్థాయి ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని, వారిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి అన్నారు.
అదే దారిలో నడవాల్సిన పరిస్థితులు..
అలాగే, కొత్త టెక్నాలజీని అర్థం చేసుకునే ఉద్యోగులు కంపెనీలకు కావాలని వీ బాలకృష్ణన్ చెప్పారు. వారసత్వంగా ఉన్న కొంతమంది ఉద్యోగుల్ని తొలగించక తప్పని పరిస్థితులు అన్నారు. డిజిటల్లోకి ఎక్కువ టాలెంట్ను ఆకర్షించే ప్రయత్నం చేయాలన్నారు. దీనికి మరో మార్గం లేదని చెప్పారు. కంపెనీల మార్జిన్లపై ఒత్తిడులున్న నేపథ్యంలో ఉద్యోగులను తగ్గించుకున్న కొన్ని కంపెనీల బాటలోనే మిగతా కంపెనీలు నడవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.
కస్టమర్లు వ్యయాల గురించి ఆలోచిస్తున్నారు
డిజిటల్కు మారుతున్న సమయంలో కస్టమర్లు కూడా తమ వ్యయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని వీ బాలకృష్ణన్ చెప్పారు. ఈ నేపథ్యంలో కంపెనీలు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుందని, ఎక్కువగా ఉన్న ఉద్యోగుల భారాన్ని తగ్గించుకోవడం తప్పనిసరి అన్నారు. ఇది అన్ని కంపెనీలకు వర్తిస్తుందన్నారు. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ దారిలోనే మార్జిన్ ఒత్తిడి కలిగిన ఇతర కంపెనీలు కూడా నడుస్తాయన్నారు.
స్థిరంగా ఐటీ వృద్ధి
2019 క్యాలెండర్ ఇయర్లో ఇండియన్ ఐటీ సర్వీసుల కంపెనీల వృద్ధి స్థిరంగా ఉందని వీ బాలకృష్ణన్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి సంబంధించిన ఆందోళనలు ఉన్నాయన్నారు. అయితే దీని ప్రభావం ఐటీ రంగంపై కనిపించలేదని తెలిపారు. వృద్ధిని డిజిటల్ నడిపిస్తోందని, కొత్త టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీలు పునర్నిర్మించుకుంటున్నాయన్నారు. డిజిటల్ పైన అందరూ దృష్టి సారిస్తున్నారన్నారు. వారసత్వ టెక్నాలజీలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నట్లు తెలిపారు.
క్రమంగా దూరం...
కంపెనీలు డిజిటల్ పైన ఎక్కువ దృష్టి సారిస్తున్నాయని వీ బాలకృష్ణన్ చెప్పారు. వృద్ధి అక్కడే ఉందన్నారు. ఉద్యోగులను కూడా టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకుంటున్నట్లు చెప్పారు. తద్వారా వారసత్వ టెక్నాలజీ నుంచి క్రమంగా దూరం జరుగుతున్నాయన్నారు. ఉత్పత్తి వ్యయాలు, ప్రయోజనాలు సమంగా ఉండేలా చూసుకుంటున్నట్లు తెలిపారు. మాంద్యం భయాల నేపథ్యంలో 2020లో ఐటీ సంస్థల అవకాశాలపై మాట్లాడుతూ... ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు స్థిరంగా ఉన్నాయని, మాంద్యం భయం లేదన్నారు. అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకెళ్లాలన్నారు.