Deloitte: టెక్ దిగ్గజం డెలాయిట్ కూడా మోసం చేస్తోంది..? జీతం లేకుండా జాబ్స్ ఎందుకు..?
Deloitte: ఎటుచూసినా ఐటీ ఫ్రెషర్లకు గడ్డు కాలమే నడుస్తోంది. హమ్మయ్యా ఉద్యోగం వచ్చింది అనుకున్న వారికి ఇప్పుడదే పగటి కలగా మారినట్లు కనిపిస్తోంది. ఇటీవలి నెలల్లో ఐటీ కంపెనీల నుంచి రోజుకో సెన్సెషనల్ వార్త వెలువడుతూనే ఉంది. తాజాగా అమెరికాకు చెందిన డెలాయిట్ సైతం ఇలా మోసం చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
వరుస వార్తలు..
ఇంతకు ముందు దేశంలో ఐటీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమినీ లాంటి కంపెనీలు ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇచ్చినా ఉద్యోగం కోసం సంస్థలు పిలవలేదని వారత్తలు వచ్చాయి. ఆన్ బోర్డింగ్ డిలే చేయటం, వివిధ కారణాలతో ఇచ్చిన ఆఫర్ లెటర్లను కంపెనీలు రద్దు చేసిన ఘటనలు చూశాం. క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి.
డెలాయిట్ కూడా..
ఐటీ సేవల కంపెనీ డెలాయిట్ కూడా చాలా నెలలుగా ఉద్యోగానికి ఎంపికైన వారిని తిరిగి పిలవలేదు. ముఖ్యంగా అక్టోబర్ 2021లో ఎంపికైన వారు కూడా కంపెనీ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 2021లో డెలాయిట్ నుంచి ఆఫర్ లెటర్ అందుకున్న ఒక వ్యక్తి మాట్లాడుతూ.. తనను కంపెనీ ఇప్పటికీ పిలవలేదని చెప్పాడు. తాను ఇంకా ఎదురుచూస్తున్నానంటూ బాధపడ్డాడు.జాబ్ లో చేరేందుకు ఏడాది నుంచి వేచి ఉన్నానని చెప్పాడు.
మోసం చేస్తున్నారా..?
2021లో ఆఫర్ లెటర్ ఇచ్చిన వ్యక్తిని ఇప్పటికీ వేచి ఉంచటం మోసమేనని చాలా మంది టెక్కీలు అంటున్నారు. ఇలాంటి వాటితో ఉద్యోగుల బంధువులు, కుటుంబాలకు అసలు ఉద్యోగాలు వచ్చాయా..? లేక మోసం చేస్తున్నారా..? అని తమ పిల్లలను అడుగుతున్నారు. ఇంట్లో వారు ఇలా అడగటంతో.. ఇలాంటి పరిస్థితి ఎదురుకావటంపై బాధ పడ్డాడు సదరు ఫ్రెషర్.
ప్రస్తుత విద్యార్థులు..
ప్రస్తుతం ఐటీ మార్కెట్లో మందగమనం వల్ల ఇప్పటికే సెలక్ట్ అయిన ఫ్రెషర్లు వేచి ఉండటంతో.. ఆ ప్రభావం అవుట్ గోయింగ్ ఫ్రెషర్లపై పడుతుందని తెలుసుస్తోంది. వారికి ఉద్యోగ అవకాశాలు మరింత ఆలస్యం అవుతుందని జాబ్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. చాలా మందిలో కంపెనీలు సెలక్ట్ చేసి.. ఇలాగే మోసం చేస్తాయా అనే అందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయం లేకుండా ఉద్యోగం..
ఉద్యోగం చేతికి అందినట్లే అంది నోటికి అందదన్నట్లుగా ఐటీ ఫ్రెషర్ల పరిస్థితి మారిపోయింది. ఉద్యోగం వచ్చినా ఆఫీసులకు వెళ్లి పనిచేయలేని స్థితి. ఉద్యోగం వచ్చినా ఆర్థికంగా తమకు ఆదాయాన్ని ఇవ్వకపోవటంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ కంపెనీలు సైతం ఇలా ప్రవర్తించటం సరికాదని అంటున్నారు.