టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్.. భారీగా తగ్గిన హైరింగ్.. H2లో రికవరీ...
భారత టాప్ 4ఐటీ కంపెనీలు 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 12,258 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 54,002 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ఈసారి కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఉద్యోగాల కోత, వేతనాల కోత చోటు చేసుకుంది. అయితే మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగం కాస్త ఆశాజనకంగా ఉంది. అయితే గత ఏడాది ఏప్రిల్-జూలై త్రైమాసికంతో పోలిస్తే ఈసారి నియామకాలు మాత్రం తగ్గాయి. క్యాంపస్ నియామకాలు కూడా క్షీణించాయి.

రెండో అర్ధ సంవత్సరంలో జూమ్
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో కంపెనీల నియామకాలు ఏకంగా 70 శాతం నుండి 80 శాతం మేర క్షీణించాయి. టాప్ 4 కంపెనీల్లో టీసీఎస్లో నియామకాలు మిగతా సంస్థలతో పోలిస్తే ఎక్కువగా క్షీణించాయి. టీసీఎస్లో 80 శాతం క్షీణించి 26,453 నుండి 5,076కు పడిపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో నియామకాలు తగ్గినప్పటికీ, రెండో అర్ధ సంవత్సరంలో పెరుగుతాయని భావిస్తున్నారు.

ఆయా కంపెనీల్లో తగ్గిన నియామకాలు
2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంతో పోలిస్తే 2020-21 మొదటి అర్ధ సంవత్సరంలో నియామకాల క్షీణత ఇలా ఉంది.టీసీఎస్లో 80 శాతం క్షీణించి 26,453 నుండి 5,076కు, హెచ్సీఎల్ టెక్లో 71 శాతం క్షీణించి 9,158 నుండి 2,662కు, విప్రోలో 76 శాతం క్షీణించి 10,028 నియామకాల నుండి 2,357కు, ఇన్ఫోసిస్లో 74 శాతం క్షీణించి 8,363 నుండి 2,163కి తగ్గాయి.

ఐటీ కంపెనీలు..
ఐటీ కంపెనీలు రెండో అర్ధ సంవత్సరంలో వేగంగా కోలుకుంటాయని నిపుణులతో పాటు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా అంచనా వేస్తున్నాయి. కొత్తవారిని నియమించుకుంటామని ఇప్పటికే ప్రకటించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ రెండో క్వార్టర్ ఫలితాలు అంచనాలు మించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications